నా బ్లాగు తరలించబడింది

అక్టోబర్ 3, 2006

క్షమించండి నా బ్లాగు వేదిక నా సొంత డొమైన్‌కు http://charasala.com/blog/ మారింది.

దయచేసి ఇక్కడ మీటండి.

–ప్రసాద్

రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు

సెప్టెంబర్ 19, 2006

తాడేపల్లి సుబ్రమణ్యం గారూ,
అవునండీ రిజర్వేషన్ల మూలంగానే దేశం బ్రష్టుపట్టిపోతోంది. ఈ దేశంలో ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ఇతర మత్రిపదవులన్నీ అగ్రకులాలమని చెప్పుకునే జాతులకి రిజర్వ్ చేయబడ్డాయి. డొనేషన్లు కట్టగలిగి, లంచాలు  మేపగలిగిన బడాబాబులకి పెద్ద పెద్ద కళాశాలల్లో సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. డబ్బున్న వాడికీ, పెద్ద కులమున్న వాడికే ప్రభుత్వపు ప్రతి సేవా రిజర్వ్ చేయబడ్డది. అనాది నుంచి ఆర్యమతమంటూ, మనువు సూత్రమంటూ చెప్పులు కుట్టే వృత్తి మాదిగలకీ, చేతి గోళ్ళు తీసే వృత్తి మంగలోళ్ళకీ, అంటు గుడ్డలు వుతికే వృత్తి చాకలోల్లకీ రిజర్వ్ చేయబడ్డాయి. వంట చేయడం, ఇంటిల్లిపాదినీ సుఖపెట్టడం స్త్రీకి రిజర్వ్ చేయబడింది. ఈ విధంగా దేశ జనాభాలో అధిక శాతం మందిని అణగదొక్కి మేము అగ్రకులమని, పండితులమనీ అతికొద్దిమంది ఈ రాజ్యాన్ని పాడుచేసి, చివరికి పిరికి పందల్లా విదేశీయులకు రాజ్యాన్ని గుత్తగా అప్పగించేశారు! అప్పుడేమయ్యింది వీరి అగ్రకుల అధికత్వం? అప్పుడేమయ్యింది వీరి పోరాటపఠుత్వం? ప్రజల్లో 80 శాతం మందిని ఇలా నిర్వీర్యం చేయకుండా వుండివుంటే (కుల రిజర్వేషన్ల పేరుతో), వాళ్ళను బానిస ప్రవృత్తికి అలవాటు చేయకుండా వుండివున్నట్లయితే మన దేశం అన్నినాళ్ళు పరాయి పాలనలో మగ్గాల్సి వుండేదా?

ఒక్క అగ్రకులాలే మనకు ఒక ఆర్యబట్టుని, ఒక రామానుజాన్ని, ఒక ఠాగూర్ని, ఒక గాంధీని అందించగలిగితే ఇక అన్ని కులాలకీ, సమస్త భారత ప్రజలకీ అలాంటి అవకాశాలే వుండివుంటే మరెంత మంది వేద వ్యాసులు, వాల్మీకులు, ఏకలవ్యులు అందివచ్చేవారు. ఈ కుల వృత్తుల రిజర్వేషన్లే లేకుంటే?
అవును మీరన్నట్లే ఈ రిజర్వేషన్ల మీద వచ్చిన వారిని ఏమనలేం! ఈ నిమ్న కులాల వాళ్ళు తరతరాలుగా “సుబ్బిగా”, “లచ్చిగా”, “ఏమే” అని పిలిపించుకున్నవాళ్ళు, మనము ఎదురు పడితే కాళ్ళ చెప్పులు, భుజం మీది కండువా చేతిలో పట్టుకొని వినయంగా దారి పక్కన నిలుచుని దారిచ్చిన వాళ్ళు, “అయ్యా”, “స్వామీ”, “రెడ్డీ”, “పటేలూ”, “కాల్మొక్కుత”, “నీ బాంచెను దొరా!” అంటూ మన దయాధర్మాల మీద బతికిన వాళ్ళు, వీళ్ళకెంత పొగరు? “ఓ మాదిగోడా” అని పిలిస్తే నా కులం పేరు పెట్టి దూశించాడు అంటాడా? వాడి తాతముత్తాతలు మా తాత ముత్తాతల దగ్గర్నుండీ అలా పిలిపించుకోలేదా? ఇప్పుడెందుకు రావాలి రోషం? అయినా ఈ జూనియర్ కాలేజీలో అధ్యాపక వృత్తులన్నీ ఈ అలగా జనానికి రిజర్వ్ చేయబడ్డాయని నాకు తెలియదే? ఒక వేళ చేయబడ్డా అందులో ప్రిన్సిపాలో, డిపార్ట్‌మెంటు హెడ్డో అగ్ర కులపోడే అవ్వాలే! అలా కాకుండా ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళనీ, జుట్టు కత్తిరించేవాళ్ళనీ తెచ్చి ఇలా ఉపాద్యాయ వృత్తిలో కూర్చోబెడితే ఏం జరుగుతుంది? కాలేజీలు మూసేయడం మినహా! మరి ముఖ్యమంత్రుల పోస్టులన్నీ ఈ అగ్రజాతులకి రిజర్వ్ చేయబడ్డా రాష్టానికి, దేశానికీ ఏమీ దుర్గతి? అద్యాత్మికత, పూజలూ, దర్మ ప్రచారమూ తరతరాలుగా బ్రాహ్మణ కులానికి రిజర్వ్ చేయబడ్డా ఇంకా ఎందుకీ మతమార్పిడులూ, అధర్మ వ్యాప్తి?అనాదినుండీ క్షత్రియ కులానికే రాజ్యాధికారము అప్పజెప్పినా ఎందుకు మనం చెంఘిజ్ ఖాన్ మొదలుకొని పరాయి రాజుల పాలబడి ధన, మాన, ప్రాణాలను పోగొట్టుకున్నాం? వైశ్యులే వ్యాపార దక్షులైతే మరెందుకు మనం నిన్నా మొన్నటి వరకు కనీసం న్యూయార్క్ ఎక్సేంజ్ లో నమోదుకాలేక పోయాం? అన్నిటికీ కిఆరణం మన దేశ దుర్గతికి కారణం రిజర్వేషన్ళే! వీసమెత్తు అనుమానం లేదు.
మాదిగైనా, మాలైనా అర్చక వృత్తిని నిర్వహించనీయండి.
బ్రామ్హణుడైనా, క్షత్రియుడైనా చెప్పులు కుట్టనీవండి.
ఏ వృత్తి ఎవరైనా వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి చేయనీవండి.
అన్ని వృత్తి నైపుణ్యాలనూ అందరికి అందించే విధంగా సమానావకాశాలను కల్పించండి.

ఆమెవరో ఫీజు కట్టలేక డాక్టరు కోర్సు చేయటానికి అర్హత వున్నా చేరలేక పోయిందట!
వాడెవడో ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయినా డబ్బు పెట్టి సీటు కొని MBBS చేస్తున్నాడట!
అందరి ముందూ అందమైన అమ్మాయిని బీరుపోయలేదని కాల్చి చంపి, డబ్బూ, అధికారం ముసుగేసుకొని చట్టాన్ని తనింటి కాపలాకుక్కలా చూస్తున్నాడట!
తన తాత, తండ్రీ పదవుల్లో వున్నారు గనుక ఆ మంత్రి పదవి తనకే రిజర్వ్ చేయాలంటున్నాడట!

తక్కువ జాతి వాళ్ళు చిన్న చిన్న నేరాలు చేస్తే, పెద్ద జాతి వాళ్ళు పెద్ద నేరాలు చేస్తున్నారు! తక్కువ జాతి వాళ్ళు జేబు కొట్టేస్తే, పెద్ద జాతి వాళ్ళు దేశ ఖజానానే కొట్టేస్తున్నారు.
తక్కువ జాతివాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి ముందుండే చట్టం, అధికారం, డబ్బూ వున్న వాళ్ళ పెరట్లోకి కూడా వెళ్ళలేక పోతోంది.

ఇన్ని రకాల రిజర్వేషన్లు మన సమాజాన్ని వేల ఏళ్ళ తరబడి పీల్చి పిప్పిచేస్తున్నా ఎందుకండి ఇప్పుడు మాత్రమే రిజర్వేషన్లు తప్పంటూ వీధుల కెక్కుతున్నారు? అగ్రకులపు చేద బావి నీరు పెద్ద కులపోళ్ళకే ఎందుకు రిజర్వ్ అయ్యింది? నిమ్న్ కులాల వాళ్ళు దాని దరిదాపులకైనా ఎందుకు రాలేకున్నారని మీరెప్పుడైనా ప్రశ్నించారా? వీధుల కెక్కి ధర్నాలు చేశారా?
పల్లకీ మోసేవాళ్ళెపుడూ బడుగు జీవులే ఎందుకవ్వాలి, మనం ఎందుక్కాకూడదని ఎప్పుడైనా గొంతు చించుకొని అరిచారా?
వూరి చివర వున్న టీ కొట్టు చూరులో పెట్టిన సత్తు గిన్నె మాదిగ వాళ్ళకే ఎందుకు రిజర్వ్ అయ్యిందని ఎన్నడైనా రాగాలు తీశారా?
వూరుమ్మడి ఆస్తిగా జోగినీ అవతారాలు మాదిగ బిడ్డలకే ఎందుకు రిజర్వ్ అయ్యాయని కాసింత విచారించారా?
రాత్రయితే మాలామాదిగ పూరిగుడిసేలో దూరే వాడు కూడా, మాలామాదిగకు చెంబెత్తి నీళ్ళేందుకు పోస్తాడని మీరెప్పుడయినా నిలదీశారా?
పిల్లీ, కుక్కా తిరిగే ఇంటిలోకి కూడా మాదిగెందుకు వెళ్ళడని మీకనిపించలేదా?
గర్బగుడి పూజారికే ఎందుకు రిజర్వ్ అయ్యిందని మీకెప్పుడు ఆందోళన చెయ్యాలనిపించలేదా?

ఆ పదివేల మందిలో 60 శాతం రిజర్వేషదారులుంటారని లెక్క తేల్చారే, రెకమండేషన్ల మీద, డబ్బులు పెట్టి, కులం పేరు చెప్పి ఉద్యోగం కాజెయ్యాలనే ప్రబుద్దుల్లో ఎంత శాతం మంది వుంటారు రిజర్వేషదారులు? వుద్యోగం రాకుంటే ఇక బతకలేని వాడు, లక్షలు వెచ్చించి అమెరికా పోలేని వాడు, ఇన్‌ఫ్లుయెన్సు చేయగలిగన ఒక్క బందువైనా అధికార హోదాలో లేని వాడూ ఇంకేం చేయగలడు? తనకు దొరికిన దొడ్డిదారి చూచుకోక? వీళ్ళనయితే పట్టుకోవచ్చు మరి తమకున్న పలుకుబడి, డబ్బు, అధికార బలంతో వెయ్యికి పైగా పెట్రోలు బంకులని బందువులకీ, అయిన వాళ్ళకీ దారాదత్తం చేసిన వాళ్ళకి శిక్ష ఏదీ?

కాలిన కడుపుతో నేరం చేసిన వాడి కంటే నిండిన కడుపుతో నేరం చేసిన వాడూ ఎక్కువ నేరస్తుడు కాదా?

“బ్రిటీషువారి కాలం దాకా అద్భుతంగా పనిచేసిన సర్కారీ విద్యాసంస్థలు తర్వాతి కాలంలో ఇలా నీచాతినీచంగా భ్రష్టుపట్టిపోవడానికి వేరే కారణం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా బోధపడదు- రిజర్వేషన్లు తప్ప. రిజర్వేషను సదరు వర్గాలకి రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుట. నిజానికి అవి ఆనాటి రాజ్యాంగ సభా సభ్యులైన అగ్రకులాలవారి దయాధర్మభిక్షం.”
రిజర్వేషన్లు తప్ప మీకెంతకూ ఇంకో కారణం కనపడకపోవడం ఆశ్చర్యం. లంచగొండితనం, అవినీతి, బందు ప్రీతి, దురాశ కాదా? ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా గనులు తవ్వుకుంటున్నది ఎవరు రిజర్వేషదారులా? పెన్నా నదిలో ఇసుకను తలిస్తున్నది ఎవరు రిజర్వేషదారులా? ఈ వేసవిలో వేసిన రోడ్లు వచ్చే వర్షాకాలానికి పాడయ్యేది ఎవరివల్ల,  రిజర్వేషదారుల వల్లనా? కారంచేడు ఊచకోత రిజర్వేషదారుల వల్లనేనా?
రాంజ్యాంగ సభలోని కొద్దిమంది అగ్రకులాల ధర్మ బిక్ష
కాదు రిజర్వేషన్లు. అప్పటికే అంబేద్కర్ నాయకత్వాన జరిగిన దళితోద్యమ ఫలాలవి. ఒకవేళ రాజ్యాంగమే వాటిని ఇవ్వకపోయి వుంటే, తరతరాలుగా వేదాల పేరు చెప్పో, మనుస్మృతి పేరు చెప్పో ఇంకా అణగదొక్కి వుంచాలనుకొంటే అది ఇప్పటి ఇన్‌ఫర్‌మేషన్ యుగంలో సాధ్యం కాదు. నిమ్న జాతులొక్కటై అగ్రకులాల అహంకారానికి ఎసరు పెట్టి మరీ తమ హక్కుల్ని సాధించుకొనే వారు. అణగ దొక్కే కొద్దీ పడి వుండి పురాణాలని,  అగ్రకులాల వేదాంతాన్ని నమ్మటానికి ఇది ఇంకా వేద కాలం కాదు సుబ్రమణ్యం గారూ!
–ప్రసాద్

కొడుకా, కూతురా!

సెప్టెంబర్ 12, 2006

 ఏదో సందర్బంలో యండమూరి అంటాడు ‘ప్రతి సంబందమూ చివరికి ఆర్థిక సంబందమే’నని. ఆది ఏదో కొన్ని సందర్భాల్లొ తప్పు కావచ్చేమొ గానీ చాలా సందర్బాల్లో నిజమే! పిల్లల నుండి రేపేదో ఆశిస్తూ ఈరోజు వారిమీద ఖర్చు చేయడాన్ని పెట్టుబడిలా భావించడం ఫంక్తు వ్యాపారి లక్షణం! కొడుకైతే రేపేదో వుద్దరిస్తాడని, వంశాన్ని నిలుపుతాడనీ, పున్నామ నరకం నుండీ తప్పిస్తాడనీ కొడుకు కావాలనుకోవడం, కూతురి మీదకంటే కొడుకుమీద అధిక ప్రేమ చూపించడం అనాగరికం, అవలక్షణం. నిజం చెప్పాలంటే కొడుకు దగ్గరికంటే కూతురి దగ్గరే అధిక ప్రేమ లభిస్తుంది. అదేదో సామెత కూడా వుంది ..’కొడుకు బందువులైతే వాకిట్లోదాకా..కోడలి బందువులైతే వంటింట్లో దాకా’ అని. కోడలు నడిపే కొడుకు సంసారంలో కంటే కూతురు నడిపే సంసారంలో స్వాతంత్రం ఎక్కువ వుంటుంది. తల్లిదండ్రుల మనసు వీధులు పట్టుకు తిరిగే కొడుకు కంటే ఇంటిపట్టున వుండే కూతురికే ఎక్కువ తెలుస్తుంది. బాధలైనా కొడుకు దగ్గర చెప్పుకోవాలంటే నామోషీ పడే తల్లి కూతురి దగ్గర స్వేక్షగా చెపుతుంది. అన్నెందుకు అన్న దగ్గరకంటే అక్క దగ్గరే చనువూ, స్వాతంత్రమూనూ! ఏ విధంగా చూసినా స్త్రీ (అక్కగా, చెల్లిగా, తల్లిగా, కూతురిగా, బార్యగా) ఇచ్చే శాంతి, సుఖము ఇంకెవరిస్తారు?
మన సుఖసంతోషాల కోణం నుండీ కాకుండా పిల్లల సుఖసంతోషాల కోణం నుండీ చూస్తే కొడుకు మీద కంటే కూతురు మీదే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి వుంటుంది. feminists ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడది అబలే. ఒక్క ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, బండరు నాయకే లను చూపించి ఆడది అబల కాదు అంటే ఎలా కుదురుతుంది? మగాళ్ళలో బలహీనులున్నట్లే ఆడవాళ్ళలో బలవంతులూ వుంటారు. అందం, సుకుమారం, సౌశీల్యం ఆడవాళ్ళ లక్షణాలు. వీటిని బట్టి చూస్తే కొడుక్కివ్వాల్సిన దానికంటే కూతురికి ఎక్కువ రక్షణ అవసరం. కొడుక్కి నేర్పించాల్సిన విద్య కంటే తన కాళ్ళపై తను నిలబడేలా శిక్షణ కూతురికే అవసరం. కూతురికి ఏ విద్యా నేర్పక మరింత బలహీనురాల్ని చేసి, ఇంకో మగాడికి అంటగట్టి, అతడి చెప్పుకింద రాయిలా అణిగిమణిగి వుండమనడం స్వంత బిడ్డకు తండ్రే చేస్తున్న అపచారం!
తల్లిదండ్రులుగా మనం పెట్టే ఖర్చు మన పిల్లల్ని తమ సొంత కాళ్ళమీద నిలబెట్టేందుకు వుపయోగపడాలిగానీ ముసలిదశలో మనకాళ్ళు నిలవటానికి కాదు.
ఇక వంశం ప్రకారంగా చూసినా కూతురే మన వాంశం నిలిపే గ్యారంటీ వారసురాలు. “తండ్రి నమ్మకం, తల్లి నిజం” అనెక్కడో చదివాను. కాబట్టి మన లక్షణాలను ఖచ్చితంగా తర్వాతి తరానికి మోసుకుపోయేది తల్లిగా కూతురే గానీ కొడుకు కాదు.
ఇక కట్నం విషయానికి వస్తే, కట్నం అనేది ఒక Status symbol అయిపోయింది. కట్నం తక్కువంటే నన్ను తక్కువవాడు గా జమకడతారేమొ అని పెళ్ళికొడుకు అనుకుంటాడు. అంతెందుకు మా అక్కకిచ్చినంత కట్నము నాకెందుకివ్వవని అడిగే కూతుర్లూ తయారయ్యారు. ఎంత ఇచ్చాం అనేది పెళ్ళికూతురు వైపు వాళ్ళకీ ఎంత తీసుకున్నాం అనేది పెళ్ళికొడుకు వైపు వాళ్ళకీ వాళ్ళవాళ్ళ మర్యాద/పరువు విషయమై పోయింది. ఇలా ఎవరిస్తోమతుకు తగ్గట్లు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే సమస్యలేదు గానీ వచ్చిన చిక్కల్లా కొడుకుని అమూల్యమైన వస్తువుగా భావించి దాని విలువకు సరిపడా కట్నం తేలేదని కోడళ్ళని రాచిరంపాన పెట్టడం అసలు సమస్య! ఇంకా తమ కొడుకు qualifications వున్న ఎదురింటి కుర్రాడు తమకంటే ఎక్కువ కట్నం తీసుకున్నాడని తెలిస్తే తము మోసపోయినట్లుగా భావించి తమ కోడలి వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆడిపోసుకోవడం మరో అత్యాశ లక్షణం!
ఎన్నో నేరాలకు అత్యాశ, దురాశ, డబ్బు ప్రధాన కారణాలయినట్లే కట్నానికీ అవే కారణాలు. ఇవి బరితెగించి కొడుకులే కావాలి కూతుర్లు వద్దు అని బ్రూణహత్యలకు పాల్పడటం, అమ్మాయిలని అమ్మేసుకోవటం రాక్షస లక్షణం. రాక్షసులూ ఇలా చేసినట్లు ఏ పురాణంలోనూ కనపడదు. అంబనాధ్ అన్నట్లు ఇదేమాదిరి ఆడపిల్లల నిష్పత్తి తగిపోతే విపరిణామాలు తప్పవు. బహుశా అప్పుడు మళ్ళీ వ్యాపారప్రపంచపు డిమాండ్, సప్లై సూత్రం వర్తించి మళ్ళీ కన్యాశుల్కము విజృంబించి reverse trend మొదలవుతుందేమొ!
–ప్రసాద్

ఎందుకీ బానిసబుద్ది!

సెప్టెంబర్ 11, 2006

మన నరనరాల్లో బానిసబుద్ది జీర్ణించుకుపోయింది. జీ హుజూర్, బాంచెన్ కాల్మొక్త! అనేవి మన రక్తంలోనే వున్నాయి. ఎవడో ఒకడికి మనల్ని మనం అర్పించుకొంటేనే గానీ ముక్తి రాదనే భ్రమలో కూరుకుపోయాం. మనకు వాడూ గొప్ప అని మనం ఎదుటి వాన్ని పొగిడి, ఆరాధించి, కొలిచి సంతృప్తి పడాలని పిస్తుంది. “మా కాలంలో ఆ జమిందారు…ఆయన సోయగం… ఆ రాచటీవి …” ఇలా మన పూర్వపు జమిందారుల వైభవాన్ని, రాజుల గొప్పదనాన్ని నోరార చెప్పుకొంటేగానీ మనకు కడుపు నిండదు.

ఈ విశ్వాసంతో బతకడం చాకలి దగ్గర గాడిదలా, రైతు దగ్గర కుక్కలా అంటే మనకు భారతీయులకు అందునా తెలుగు వాళ్ళకు మహా ప్రీతి.
నాకు కె.విశ్వనాథ్ సినిమాలంటే చాలా ప్రీతి. కానీ శుభసంకల్పం చూడండి. అందులో కమల్‌హాసన్ పాత్ర చూడండి. ఆ విశ్వాసం చూస్తే నాకు ఎగటు పుట్టింది. మీలో చాలా మంది నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ నాకెందుకో ఆ అతి వినయం, అతి విశ్వాసం, రాజ భక్తి నాకు నచ్చ లేదు. నాకైతే అది కుక్కలా పడి వుండే విశ్వాసం అంపించింది.

ఇప్పుడు ఈ రాజశేఖరుని చూడండి. ఎంత వల్లమాలిన ప్రేమ వుంటే మాత్రం అవకాశం దొరికితే ఆంద్రప్రదేశ్‌ని ‘ఇందిరాప్రధేశ్’ గానో ‘రాజీవ్‌ప్రధేశ్’ గానో పేరు మార్చేట్లున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోలేనప్పుడు వాడెవడో మనల్ని గౌరవిస్తాడనుకోవడం ఒట్టి భ్రమ.
నిన్న జెమినిలో ‘బంగారం మీకోసం’లో ఒక ప్రశ్న. “మేఘమధనం’ ప్రాజెక్టు పేరేమిటి అని. దాని పేరే మేఘమధనం కదా ఇంకా పేరేమిటబ్బా అనుకొని, ఇంకేమయ్యుంటుంది ‘ఇందిరా మేఘమధనమో’ రాజీవ్ మేఘమధనమో’ అనుకున్నాను లోలోపల. అంతే నేననుకున్నదే సరైనది. జవాబు “ఇందిరా మేఘమధనము”.
నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మనకింతకంటే మహామహులు లేరా? ఆయనకున్న రాజభక్తిలో మనమందరం కూడా మునిగితేలాలా? రాజీవ్ విమానాశ్రయం, ఇందిరమ్మ పధకం, రాజీవ్ గడ్డి తినే పధకం, ఇందిరా గోళ్ళు కొరుక్కునే పధకం.. ఇంకేం పేర్లు లేవా? తెలుగు దేశం వాళ్ళు ఎంత నయం, అన్న గారు సంస్కృతాంద్రం లో పేర్లు పెడితే బాబు ‘వెలుగూ, ‘దీపం’, ‘జన్మ భూమి, ఇలా అచ్చ తెలుగు పదాల్లో పధకాల పేర్లు పెట్టాడు.

ఈ కాంగిరేసొల్లకి ప్రజలమీద భక్తి కంటే రాచరికభక్తి ఎక్కువ, సేవలో తరించిపోదామనే ఆర్తి ఎక్కువ! అమ్మా సోనియా నీ పాదధూళి సోకినా మా జన్మ ధన్యం అంటూ సాగిలపడతారు. ఆ మధ్య పంచాయితీ ఎన్నికలయ్యాక సర్పంచులు ముఖ్యమంత్రిని కలిసే సీను చూశాను. చిన్నా పెద్దా అని వయసు తేడా కూడా చూడకుండా కాళ్ళమీద సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి నివ్వెరపోయా! ఎంత ప్రజాస్వామ్యదేశమైనా యుగాల రాచరిక వాసనలు ఎలా వదుల్తాయి అంత గమ్మున? ఎంత ప్రభుభక్తి! ప్రజలమీద నమ్మకమున్నవాడు అలా సాగిలపడి నమస్కరించాల్సిన అవసరముందా?

ఇక పోనీలే ఎవడి పిచ్చి వాడిది, ఎవడి భక్తి వాడిది అని వొదిలేద్దామంటే పుట్టపర్తి విగ్రహం తీసేసి ఇందిరమ్మ విగ్రహం, వేమన విగ్రహం తీసేసి రాజీవ్ విగ్రహం పెట్టేస్తే ఎలా? రేపు హైదరాబాద్ పేరు కూడా ఇందిరా నగర్ అని పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఎవడి పిచ్చి వాడితో వుంటే ప్రమాదం లేదు కానీ ఆ పిచ్చితో మనల్ని కరిస్తే మాత్రం ప్రమాదమే!

— ప్రసాద్

ఒకసారి ఏమయిందంటే!

సెప్టెంబర్ 7, 2006

నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు. cobol కు రోజులు చెల్లి Java నేర్చుకుంటున్న రోజులు. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నప్పూడు అప్పుడే పుట్టిన ఒక దేసి కంపెని నన్నాదుకుంది. ఫుడ్డు బెడ్డు ఇచ్చి జావా నేర్చుకోమంది. ఇంకేం సాధన మొదలెట్టాను. నాకు ఇతరులు చెప్పేది విని నేర్చుకోవడం కంటే చదివి నేర్చుకోవడం ఆసక్తి. వినాలంటే మాత్రం నిద్ర వస్తుంది. Thinking in Java సహాయంతో జావా బాగానే వొంటబట్టింది త్వరగానె! నేనె ఇతరులకు చెప్పడం మొదలు పెట్టాను.
అప్పుడు నాకు ఆశ్రయమిచ్చిన కంపెనీకి జావా ట్రయినింగ్ తరగతులు నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ కంపెనీ యజమాన్యంలో ఒకాయన వుండేవాడు. ఆయనకు విషయపరిజ్ఞానం లేదనను గానీ, జావా గురించి మాత్రం ఏమీ తెలియదు. ఆయనకు తెలిసిన వన్నీ C++ గురించి. ఆయన పేరు ప్రస్తుతానికి వెంకట్ అనుకుందాం. ఈ వెంకట్ తనకున్న C++ పరిజ్ఞానం తోనే java క్లాసులు నెట్టుకొచ్చేవాడు. ఏదో ఒక బుక్‌లోని సమస్య ఇచ్చి ప్రోగ్రాం రాయమనేవాడు. రాసింది సరిగ్గా వుండొ లేదో నన్ను చూడమనే వాడు! వాళ్ళకు వచ్చిన ఏదైనా ప్రాక్టికల్ సమస్యలకు నన్ను సహాయం చేయమనే వాడు. ఇదంతా తనకు java రాక పడే అవస్త అనే విషయం నాకు రెండు sessions అయ్యాక గానీ అవగతమవలేదు. వచ్చి నట్లుగానే OOPS Concepts చెప్పేవాడు. ఎలాగూ C++ వచ్చు గనక సమస్య లేక పోయింది. అయితే ఒకసారి java లో multiple inheritance ఎందుకు లేదు అనేదానికి సమాధానం చెప్పలేకపోయాడు. “ఏదో కొత్త లాంగ్వేజ్ కనిపెట్టలని తాపత్రయపడి multiple inheritance తీసేసి మళ్ళీ దాన్నే multiple interfaces ను implement చేయవచ్చంటూ మెలికలు తిప్పారు” అని ఈసడించుకున్నాడు. అప్పటికే Thinking in Java ను జీర్ణం చేసుకొని వున్నాను గనుక ఆయన వాదన అసంబద్దమనిపించింది.
ఇదే విషయమై ఒకసారి restroom లో నా సహచరుడు అడిగితే నా అబిప్రాయం చెప్పి “ఈయనకు జావా రాదు గీవా రాదు..ఏదో నెట్టుకొస్తున్నట్టున్నాడు” అన్నాను. దానికి తోడు అవతలి వాడు అతని మీదున్న తన అక్కసు వెళ్ళగక్కాడు.
ఇదంతా అదే restroomలో దొడ్డికి కూర్చొని ఆ ఆఫీసు మేనేజరు వింటున్నాడని మాకు తెలియదు.
ఇక ఆ సాయంత్రం వెంకట్ జావా క్లాసులు ఎలా చెప్తున్నాడు feedbak ఇవ్వండి అంటూ ఆ కంపెనీ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేశాడు. (ఈ బాత్‌రూంలో విన్న వాడు ఆయనకు అంతా చెప్పేశాడు) మేము బాగానే చెప్తున్నాడు అంటాం మొహమాటం కొద్దీ! అలా గాదు మళ్ళి చెప్పండి అంటాడు ఆ మేనేజరు! మాకెంతకీ అర్థం కాలేదు. చివరికి మధ్యాహ్నం బాత్‌రూంలో మీరనుకున్నదే చెప్పండి అన్నాడు.
అప్పుడు చూడాలి మా మొహం! అప్పుడిక చెప్పక తప్పలేదు ఆయన బోధనలోని కుప్పిగంతులు. అందరికీ తప్పినాయి ఆయన క్లాసులు గానీ మాకు మాత్రం చాలా రోజులు తప్పుచేసిన ఫీలింగ్!

— ప్రసాద్

ఓ గేయమా! నీకు నా వందనం!

సెప్టెంబర్ 7, 2006

వందేమాతరం! వందేమాతరం!

సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం !

శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం !

సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం !

వందేమాతరం! వందేమాతరం!

హా! పాడుతుంటే ఎంత ఆహ్లాదం! ఎంత సుఖం! నరనరాల్ని సంతోషం మత్తులో ముంచే ఈ పాదాలు ఎంత రమ్యం! అది ఏ భాష అని గానీ ఎవరు రాశారు అనిగానీ నా మదిలో స్పురణకు రావు. అవ్యక్తానంద పరిమళాలు ఒళ్ళంతా నిమురుతాయి! రోమాలు సంతోషంతో నిక్కబొడుచుకుంటాయి! ఈ పాట పాడి తన్మయం చెందడం ఎంత వరం! ఏ కారణం వల్లనైనా పాడలేకపోవడం, వినలేకపోవడం ఎంత దౌర్భాగ్యం!

— ప్రసాద్

పుచ్చకాయ (watermelon)

సెప్టెంబర్ 1, 2006

రామనాధరెడ్డి గారి ఇన్స్పిరేషనుతో నాక్కూడా నా చిన్నప్పటి సంగతులు బ్లాగిద్దామనిపించింది.

బహుశా నాకప్పుడు పద్నాలుగేళ్ళనుకుంటాను. ఇంటి దగ్గర పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం మా నాన్నకు ఇష్టం ఉండేది కాదు. పుస్తకం పట్టుకొని ఊరికే ఇంటిదగ్గర కూర్చోకపోతే అలా పొలానికెళ్ళి చెట్టుకింద కూర్చొని చదువుకోవచ్చుగా ఆనేవారు. అలా పుస్తకం పట్టుకొని ఒకసారి పొలానికెళ్ళాను.

అప్పుడు పొలంలో పుచ్చకాయలు ( మా ప్రాంతంలో కర్బూజ కాయలంటాము) మంచి పక్వ దశలో వున్నాయి. మంచి పండిన కాయను తినాలని ఆశ. మంచి కాయను తినే భాగ్యము పండించేవాడికుండదని సామెత కదా! అలా మా నాన్న కూడా అంత ఆకర్షణీయంగా వుండని పళ్ళు తినడానికి ఇచ్చేవాడు.
ఇక ఇప్పుడు కాపలా కాస్తున్నది నేనే కదా! తోటంతటికీ పెద్ద కాయని, బాగా పండిన దానిని తినాలనే నా కోరికను తీర్చుకోవాలను కున్నాను. కానీ పెద్ద కాయ తెలుసుకోవచ్చు గానీ పండిందో లేదో తెలుసుకోవడం ఎలాగా? అన్ని కాయలూ ఆకుపచ్చగానే వున్నాయి. అప్పుడు తళుక్కున ఓ ఉపాయం తట్టింది. మనం పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు అమ్మేవాడు దానికి రంద్రం పెట్టి (టాకా వేసి) పండిందో లేదో చూపిస్తాడు కదా!
మరింకేం వెంటనే నాకు నచ్చిన పెద్ద పెద్ద కాయలను తీగకు తెంపకుండానే రంద్రం వేసి పండిందో లేదో చూస్తున్నాను. పండకపోయి వుంటే రంద్రం కనిపించకుండా కింది వైపుకు తిప్పి ఆకులమధ్యలో వుంచేస్తున్నాను. అలా నాకు నచ్చిన పండిన పండు దొరికేసరికి పదిహేను మంచి కాయలకు టాకాలు పడ్డాయ్.
రెండు మూడు రోజులు గడిచినా మనం చేసిన గొప్పపని తెలియలేదు. మెల్లమెల్లగా వారం గడిచే సరికి నేను చేసిన పని కుళ్ళి పళ్ళు రంగు మారి కుంగిపోవడం మొదలయ్యింది. మా నాన్నకు ఇంట్లో పిల్లలు గుర్తున్నట్లే ఎక్కడ ఏ పళ్ళు ఉన్నాయో కూడ తెలుసు. ఇక ఆరోగ్యంగా వున్న పళ్ళు అలా కుంగి కుళ్ళిపోవడం చూసి వాటిని పరీక్షించారు. ఇంకేముంది అన్నిటికీ ఒకటే కత్తిఫోటు, అన్నిటికీ కిందివైపే. దొంగలకైతే వాటిని దాచిపెట్టాల్సిన అసరమేముంది? దొంగ సులభంగా దొరికిపోయాడు.
ఇక చూడాలి నా అవస్థ. అప్పుడనిపించింది ఇంత తెలివితక్కువగా చేశానేంటి అని. ఏదేమైయినా జరిగింది జరిగిపోయింది. నా అమాయకత్వం వూరందరికీ తెలిసిపోయింది. అందరూ నన్ను చూసి “చదివినోడి కంటే చాకలోడు మేలురా!” అనేవాళ్ళు. ఆ guilty feeling చాలా రోజులు నన్ను వెంటాడింది.

— ప్రసాద్

డబ్బు డబ్బు

సెప్టెంబర్ 1, 2006

ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకుంటున్నాం కదా. మరి మన రెవెన్యూ శాఖ ఆ ధనాన్ని మన దేశంలోనే ముద్రించవచ్చు కదా?” శ్రీనివాస గారు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా!
ఆయనకు జవాబు తెలియక కాదు బహుశా ఈ విషయం పై బ్లాగుల్ను ప్రోత్సహించడానికి ఈ ప్రశ్న వేసి వుంటారు.

డబ్బు అనేది మన శ్రమకు, లేదా తయారయిన వస్తువుకు, లేదా సేవకు ప్రతిరూపం. ఈ డబ్బు లేనప్పుడు వస్తు మార్పిడి విధానముండేది. నీవు నాకు గిద్దెడు గోధుమలిస్తే, నేను నీకు గిన్నెడు బియ్యమిస్తా. నీవు నా పొలంలో ఒకరోజు పని చేస్తే నేను రెండుపూటలా భోజనం పెట్టి, ఒక పావు బియ్యమిస్తా! ఇలా వుండేది డబ్బు సృష్టించకముందు లావాదేవీలు జరపడం. అయితే ప్రతి శ్రమకూ దాని విలువను బియ్యం తోనో, పాలతోనో, బంగారంతోనో సరికట్టడం ప్రాతి ప్రాంతానికీ వేరు వేరుగా వుండేది పైగా నిలకడగా వుంచడమూ సాద్యం అయ్యేది కాదు. పైగా శ్రమకు ప్రతిఫలంగా బియ్యమో, నువ్వులో ఇస్తానంటే వాటిని మూటగట్టుకొని వెళ్ళడం ఒక సమస్య! అంతే గాక బహుమానాలు ఇవ్వాలనుకొనే రాజులకు ఇంకా సమస్య!
అప్పుడు డబ్బు పుట్టింది. “ఇదిగో నేను రాజముద్ర వేసి రాసిచ్చిన ఈ పత్రము లేదా నాణెము ఎక్కడికయినా తీసుకెళ్ళి నీక్కావలిసిన బియ్యమో, చింతపండో తీసుకో” అని రాజు ఆజ్ఞాపిస్తే అది రాజాజ్ఞ గనుక అందరూ పాటించేవాళ్ళు. అలా రాజముద్ర వున్న ఆ నాణెమే తదుపరి డబ్బుగా చెలామణీ కావడం ప్రారంబించి వుంటుంది.
అయితే పూర్వము రాజులు ఏవిధంగా సంపదను లెక్కగట్టి ఈ నాణేలను ముద్రించేవారో గానీ ప్రస్తుత ప్రభుత్వాలకు మాత్రము కొన్ని లెక్కలున్నాయి. దాన్ని బట్టి దేశంలో వున్న సేవా సంపద, ఉత్పత్తి విలువనూ బట్టి దానికి సమానంగా డబ్బు చలామణిలో వుండేలా చూస్తారు. డబ్బు ముద్రణ ఉత్పత్తి కంటే ఎక్కువయితే అందరిచేతిలో కొత్త కొత్త కరన్సీ నోట్లు ప్రత్యక్షమై ద్రవ్యోల్బణం అధికమై వస్తువుల రేట్లు పెరిగి డబ్బుకి విలువ తగ్గి పోతుంది. డబ్బులనే తిని అరిగించుకోలేం గదా కావలిసింది వస్తువులు, సేవ, తిండి గింజలు. కనుక డబ్బు అనేది మన సంపదకు ప్రతిరూపమే గానీ అదే సంపద కాదు. డబ్బు అనేది భూమి పట్టా లాంటిది. భూమి లేకుండా పట్టా కాగితాలు తయారుచేసి పంచితే భూమిని పంచినట్లా? ఇది అంతే సంపదను సృష్టించకుండా డబ్బును సృష్టిస్తే దాని విలువ చిత్తు కాగితంతో సమానం. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా తయారుచేసిన డబ్బుతో జింబాబ్వేలో జరుగుతున్న అరాచకం చూడండి.

ఇక ప్రపంచ బ్యాంకు నుండి అప్పుతెచ్చుకోవడం అంటే పక్కదేశాల సరుకుల్ని, సేవల్ని ప్రస్తుతం ఉచితంగా పొంది భవిష్యత్తులో మన సేవల్ని , వస్తువుల్ని ఉచితంగా ఇస్తామనడం!
— ప్రసాద్

దేవుడి పుట్టుక

ఆగస్ట్ 31, 2006

రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు.
నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ ఒకేలా చల్లదనాన్ని ఇచ్చినట్లు. ఆ శక్తికి మంచి, చెడ్డా విచక్షణ తెలియదు. పసి పాపకి, వృద్దుడికి తేడా తెలియదు. ఈ విశ్వమంతా కొన్ని భౌతికసూత్రాలమీద ఆధారపడి వుంది. ఆ సూత్రాలే దేవుడనుకొంటాను.
ఇప్పుడు ఆ దేవుడి పుట్టుక ఎప్పుడు అంటే ఏమనాలి? దేవుడికి పుట్టుక లేదు. ఆది అంతాలు లేవు. ఈ దేవుడు ఎప్పుడూ వున్నాడు, కాలం ఎప్పుడూ వున్నట్లు. దేవుడిని నీవు గుర్తించినా గుర్తించకున్నా దేవుడున్నాడు. నీవు గుర్తించిన రోజు దేవుడు పుట్టినట్లు కాదు. న్యూటన్ కనుక్కోక ముందూ గురుత్వాకర్షణ వుంది తర్వాతా వుంది. అది కనుక్కోబడిందే కానీ తయారుకాబడలేదు, సృష్టింపబడలేదు. దానికి పుట్టుక లేదు. అలాగే అంతమూ లేదు. రేపు మానవ జాతి అంతా అంతమైనా అది వుంటుంది. దాన్నే సత్యము అని కూడ అనొచ్చు. ఏది మార్పు చెందదో, ఎప్పటికీ నిలిచి వుంటుందో అది సత్యము. దానికి ఆది అంతాలు లేవు. వేదాలు గురించి ఇలాగే అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది రాయబడిన వాటి గురించి కాదు ప్రవచించబడిన ధర్మాల గురించి. ధర్మము ఎప్పుడూ ధర్మమే మనిషి పుట్టకముందునుంచీ, మనిషి నశించి పోయాక కూడా!

ఇక రూపము! నా దేవుడికి రూపం లేదు. అయినా ప్రతి దానిలోనూ చోడొచ్చు. శక్తి కనపడదు, దాన్ని అనుభవించాల్సిందే! గాలిని స్పర్షాజ్ఞానముతో తెలుసుకున్నట్లు. ప్రతి శక్తీ దేవుడే, ప్రతి జీవీ దేవుడే. ఈ సకల చరాచరాలలోనూ దేన్నీ అతన్నుంచీ మినహాయించలేము. జలచరాలన్నీ ఎలా సముద్రంలోనే వుండి సముద్రం రూపాన్ని చూడలేవో అలానే మనమూ దేవుడిలోనే వుండి అతని రూపాన్ని చూడలేము. ఎల్లలు లేని రూపాన్ని, ఊహకు కూడా అందని దూరాన్ని ఎలా అదిగమించి రూపాన్ని చూడగలం! అయిటే ఈ కనిపించేదీ, కనిపించనిదీ, నేను, నువ్వూ అందరం దేవుడిలో భాగమే! ఎక్కడయితే ప్రాధమిక భౌతిక సూత్రాలు న్యాయమౌతున్నాయో అవన్నీ కూడా దేవునిలో భాగమే! రెండు రెళ్ళు నాలుగయ్యే ప్రతిచోటూ దేవుడే!

ఇక అంచెలంచెలుగా ఎదగడానికేముంది. సర్వ వ్యాపితమైనవాడు, పుట్టుక, నశింపు లేనివాడు ఇక పెరిగేదెలా? పెరగడానికి ఇంకేం మిగిలివుంది? పుట్టడం, పెరగడం, నశింపచడం నిర్దేశించే దేవుడికే పుట్టుక వుంటే, పెరుగుదల వుంటే మరి ఆ దేవుడి పుట్టుకకు ముందు ఏమున్నట్లు? వుందడం, వుండకపోవడమనేవి రెండూ దేవుడి భిన్న పార్శ్వాలే అయితే ఇక దేవుడు సృష్టికి ముందూ వున్నట్లే కదా!

— ప్రసాద్

భక్తి అంతా మూర్ఖత్వమేనా?

ఆగస్ట్ 31, 2006

నాగరాజా గారి “భక్తి అంతా మూర్ఖత్వమేనా?” అన్న ప్రశ్నకు సమాధానంగా.

నాగరాజా గారూ, నా దృష్టిలో పరులకు వుపయోగపడని భక్తి ఖచ్చితంగా మూర్ఖత్వమే! “మానవ సేవే మాధవ సేవ”; భగవంతుడు జీవులన్నింటిలోనూ వ్యవస్థితమైవున్నప్పుడు జీవిని వదిలేసి రాయిని పూజించడం మూర్ఖత్వము కాక మరేమిటి? దేవుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటానికి అవి పనిముట్లు మాత్రమే, అవే దేవుళ్ళని నానా యాగీ చేయడం ఖచ్చితంగా మూర్ఖత్వమే! జెమిని టివి లో ఏ ఉదయం చూసినా అయ్యప్ప స్వామిని పూనకంతో పూజించేవాళ్ళను చూడవచ్చు. కాసేపు అయ్యప్ప స్వామి మీద భయాన్ని, భక్తినీ వదిలేసి ఆలోచించండి అది మూర్ఖంగా అనిపించట్లేదా? అంబనాధ్ అన్నట్లు (ఆయన భారతీయత గురించి అన్నారులెండి) మనం చిన్నప్పట్నుంచి ఆ మాటకొస్తే తరతరాల్నుండి అలా condition చేయబడ్డాం. ఆ నెల దీక్ష ఏదో పది మందికి వుపయోగపడేలా వుండవచ్చు కదా?
ఇక సతసాయి, అమృతానందమయి లాంటి వాళ్ళు చేస్తున్న సమాజసేవ నాకు తెలుసు. అందుకే వాళ్ళు చేస్తుంది మాయా, మంత్రమా నాకనవసరం. వాళ్ళు దేవుళ్ళా అంటే అవును దేవుళ్ళే అనాలి. అయితే దివ్యాంశాలుండే దేవుడు కాదు, దివ్యాంశలే వున్నట్లయితే అంత ఖర్చు పెట్టి ఆ ఆసుపత్రి ఎందుకే ఆయన తదిమిందే తడవుగా రోగాలు మాయమవచ్చు కదా! పకృతి సూత్రాలకు విరుద్దంగా ప్రవర్తించడం ఎవరికీ సాధ్యం కాదు, గొంతులోంచి లింగం తీసే దాంతో సహా! కానీ ఇంతకుముందు “పూజలు యజ్ఞాలు అవసరమా” అనే ప్రశ్నకు నేను రాసిన బ్లాగులో చెప్పిన తొండ కథలా, ఎదో విధంగా మనిషిలో నమ్మకం కలిగించాలి, నమ్మకం వున్నంతవరకే ఆయన చెప్పినది సత్యమని నమ్ముతారు. అయితే తొండ కథలోలా నమ్మకం ఎలా కలిగించాడు అనేదానికంటే రోగం కుదిర్చాడా లేదా అన్నదే ముఖ్యం.
ఆ విధంగా చూస్తే ఆయన సాధించినవి అద్బుత విషయాలే! ఎడారి జిల్లాలో ఒక కుగ్రామాన్ని పట్టణం చేయగలిగాడు, ఎందరో పేదలకు వైద్యసౌకర్యం కలిగించగలిగాడు, ఎన్నో పల్లెలకు నీటి సౌకర్యం కలిగించగలిగాడు. ఇంకా ఆయన భక్తులు భక్తులు ప్రపంచమంతా ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు.
నేను చెప్పొచ్చేదేమిటంటే మంచికార్యాలు చేయడం ద్వారానే మనం దేవుడి అభిమానాన్ని సంపాదించుకోగలం (మీరు దేవుని నమ్ముతున్నట్లయితే) అతని చుట్టు భజన చేసి, దండకాలు పఠించి, కాకా పట్టడం వల్ల కాదు.
ఒక మంచి యజమాని దగ్గర అతనికి నచ్చినట్లుగా పనిచేయడం వల్ల అతని ప్రీతి పొందగలము కానీ అతని వెనకాల వుండి వందిమాగధునిలా పొగడడం వల్ల కాదు. ఈ భూమి, విశ్వం, వున్నదీ లేనిదీ, చెట్టూ పుట్టా అన్నీ అన్నీకూడా ఆయన పెరడు, ఆయన ఆటస్థలం, నాటక స్థలం. ఈ జీవులన్నీ కూడా ఆయన పుత్రులో పౌత్రులో లేదా ఆయన అంశలో. వీటికి సేవ చేయడం ద్వారా, ఈ ఆటస్థలాన్ని శుబ్రంగా వుంచటం ద్వారా, జీవులన్నీ పరస్పర సహకారముతో జీవించడం ద్వారా కదా ఆయన అభిమానాన్ని పొందగలం! అది వదిలేసి అతని చుట్టుచేరి లేదా ఆయన ఫోటోనో, ప్రతిమనో పెట్టి పూజించి డప్పులు కొట్టి, అలంకారాలు చేసి, నినాదాలు చేసి (రాజకీయనాయకులకు జిందాబద్‌లు కొట్టినట్లు.) …. ఇదా నిజంగా సత్యవంతుడైన, నిజాయితీ గల దేవున్ని తృప్తిపరిచే మార్గం?
రాజుకు వందిమాగధులు చేసే పనా మనం చేయాల్సింది?
మూర్ఖత్వం కాదా యిది?

— ప్రసాద్