Archive for the ‘పుస్తకాలు’ Category

అంజాన్

ఆగస్ట్ 30, 2006

(రచయిత అనుమతితో నాకు బాగా నచ్చిన కవిత “సందుక” నుండి)

తలపై
రెండు నిండు మట్టికుండలతో

అరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షిపిల్లలతో

దూదిమబ్బుల
నీలినీటి ఆకాశం తెరలపైన తేలుతూ

పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…

విమానం కిటికీల్లోంచి
కింద
వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…

నా ఆదిమ ప్రేయసి!

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా.

తెగిపోయిన నా రెక్కల్ని
సుతిమెత్తని చేతులతో నిమిరి
నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.

నేను మోసుకొచ్చినవన్నీ
తనివితీరా తడిమి
అతి జాగ్రత్తగా
చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.

ఏడేళ్ళ నవ్వుల్నీ
పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ
కాళ్ళ కింద నలిగిపోయిన పసిరెక్కలనీ
వాడిపోయిన కళ్ళనీ వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ
ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

నేలకు దిగిన విమానంలా
వంటరిగా దిగాలుగా
నేను

నా ప్రేయసి
నా ముందు నుంచే హడవుడిగా
అటు ఇటూ నడిచిపోయింది.

ఊరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని మూఖాల మెరుపులతో
సరసరా జారిపోయింది.

నావైపు చూసే తీరికలేదు
చూసినా గుర్తుపట్టలేదు.
అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న
ఉంగరంలా
జరజరా దొర్లిపోయింది.

యుగాలుగా
తన ఎడతెరిపి లేని దుఃఖ బీభత్స ప్రేమ ప్రవాహంలో
మునిగిన నన్ను
ఏడేళ్ళ ఎదబాటుతోనే పూర్తిగా మర్చిపోయింది.

నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ
నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ
నా కౌగిలింతలోని చెమటవాసననీ

తానెన్నడూ ఎరగనట్టే
ఎడమొఖమై అంజాన్ కొట్టింది

నేనే మనసుండబట్టలేక
గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా
రెండు చేతులూ విరగబూసి చాచినా
ఎవరు నువ్వు అన్నట్లుగా
ఎకసెక్కెపు చూపుల్ని విసిరి పారేసింది.

మట్టినీటి కుండలు పగిలి
రెక్కలు రాని పక్షి ఈకలు చెదిరి
నేల మీద కలలను ఏరుకుంటున్న
నన్ను

దారికడ్డం లెమ్మంటూ
నూకేసి విసవిసా పోయింది.

నిలువునా తడిసి ముద్దైన నేను

స్పర్ష మరిచిన
ప్రేయసి తడి లేని చూపుల ముందు

నాకు నేనే అజ్ఞబీని!

(రచన: నారాయణస్వామి)

 

 

సందుక

ఆగస్ట్ 29, 2006

ఇది నారాయణస్వామి గారి కవితా సంపుటి.
తెలంగాణా పల్లె జీవితాల శ్వాస ఇది. యాస వేరేనే గానీ ఆత్మ ఒక్కటే .. అది తెలంగాణా అయినా రాయలసీమ అయినా.. మా ముసలి అవ్వ నా వీపు నిమిరినంత అనుభూతి. వూరికి ఫోను చేసిన ప్రతిసారీ “ఎప్పుడొస్తావు నాయనా” అని అడిగే ఆప్యాయపు పలుకుల్ని ఈ కవిత మళ్ళీ గుర్తు చేసి గుండె తడిని మరింత పెంచింది.

“మల్ల యెప్పుడొస్తవు కొడుక”

యేండ్ల ముచ్చట్లు చెప్పుకోనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది –

గుడ్డి అద్దాల కండ్లెనుక
కుర్వక కుర్వక కుండపోతగ
కురిసిన వానసుంటి
ఆపేక్ష-

ఎన్నో కోల్పోతున్నామనే బాధ మనసును ఎల్లవేళలా మెలిపెడుతూనే వున్నా ఈ స్వామి కవితలు చదివాక నా మనసు పడే బాదకు అక్షర రూపమిదేనా అని మళ్ళీ మళ్ళీ వాటిని తడిమి చూసుకుంటున్నా.

“నీ ల్లు లేవు
బెక బెక కప్పల్లేవు
మునుగుకుంట తేలె
బుడుబుంగల్లేవు”

నేను అమెరికా వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఒక్కసారే ఇండియా ద‌ర్శనం వీలయ్యింది. ఆ ముప్పై రోజుల్లో కూడా అరవై పనికిరాని పనులతో ఇండియా కౌగిల్లో నిశ్శబ్దంగా ఒదిగి వూసులాడుకొనే భాగ్యం కలగలేదు. నేను వచ్చేప్పుడు చిన్న పిల్లలుగా వున్న వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, నన్ను గుర్తుపట్టలేని వారు మా వూర్లోనే చాలామంది అయ్యారు. ఈసారి నా సంద‌ర్శనలో నా బావాలు ఎలా వుంటాయో స్వామి గారు నాకు భవిష్యద్ద‌ర్శనం చేయించారు ఈ “అంజాన్” కవితలో.

“పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…”
….

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా

….

నా ప్రేయసి
నా ముందు నుంచే హడావుడిగా
అటూ ఇటూ నడిచిపోయింది.

ఉరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని ముఖాల మెరుపులతో
సర సరా జారిపోయింది.

నావైపు చూసే తీరిక లేదు
చూసినా గుర్తు పట్టలేదు.”

ఇలా ఈ కవిత మొత్తం చదువుతున్నంత సేపూ నా ప్రియమైన నెచ్చలి నాకు దూరమైన బాధలాగే గుందెను మెలిపెట్టింది.

“గాల్లోకి ఎగిరాక గానీ” కవిత చదువుతుంటే ఏ ప్రవాసుడికైనా కన్నులు చెమ్మగిల్లక మానవు.
“వణుకుతున్న చేతులతో
ముఖాన్ని తడిమిన
మట్టి ఆత్మీయత
అర్థం కాదు”

ఇక తుపాకుల మోతల మద్య మోడులైన జీవితాల గురించి రాసిన కవితలు మరీ బాగున్నాయి.

“వేకువ-సంధ్య” కవితలో
“చెప్పలేని
దిగులు వ్యధతో
చలిని కప్పుకు వణికిన
ఒక రెండు చేతుల రాత్రి-”
నాకు అమెరికా వచ్చిన తొలినాళ్ళలో ఇంటి తాళంచెవిలేక, సహ రూమ్మేట్లు ఇంటిలో లేక వాళ్ళు వచ్చేవరకు ఇంటివెనుక బాల్కనిలో చేతులూ కాళ్ళూ పొట్టలోకి ముడుచుకొని తూట్లుపొడిచే చలినుంచీ కాపాడుకొనే విశ్వప్రయత్నం గుర్తుకొచ్చింది.
ఇక “అపరిచితం” లో
“కలధూళి ఎగిసి
కన్నీరు గరగరలాడకుండా
నల్లని రే-బాన్ గ్లాసెస్ పెట్టచ్చు

రాత్రి
నిద్రలేమి కత్తులై కోయకుండా
ఎలక్ట్రిక్ హీటర్లలో
మొహం దాచుకోవచ్చు”

సహజత్వం లేని వస్తుజీవితాలని గుర్తుచేసింది.

“ఒక్క ముచ్చట” తెలంగాణా వుద్యమానికి మోసం చేసి పబ్బాలు గడుపుకొనే రాజకీయనాయకులకు హెచ్చరిక చేస్తుంది.

ఎంత చెప్పినా ఈ కవితలన్నీ చదివితీరాల్సినవి. శివారెడ్డి గారు, ఎన్.వేణుగోపాల్ గారు తమ ముందుమాటల్లో చక్కగా వివరించారు.

— ప్రసాద్
 

ఉత్పత్తి మరియు సామర్థ్యత (Production and Production capacity, P/PC balance)

జూలై 20, 2006

దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి రచయిత బాతు, బంగారు గుడ్డు కథ చెపుతాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఉత్పత్తిని బంగారు గుడ్డు అనుకుంటే, బాతు ఉత్పత్తి సామర్థ్యము అవుతుంది. ఈ కథలో మంగలి అత్యాశకు పోయి అంత బంగారమూ ఒకేసారి కావాలని బాతు పొట్ట చీలుస్తాడు. అంటే ఉత్పత్తి మీద శ్రద్ద చూపించాడేగానీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేశాడు. పలితం అసలుకే మోసం.
అలాగే బాతును మాత్రమే పట్టించుకొని బంగారు గుడ్డును నిర్లక్షము చేసినా పలితము సున్నా. కారును సరిగ్గా దాని సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలంటే దాని నిర్వహణనీ పట్టించుకోవాలి. బాతు కథలో మంగలిలా కారు నిర్వహణమీద శ్రద్ద చూపకుండా వాడుకుంటే కొన్ని నెలలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత అది త్వరలోనే మూలపడి పనికి రాకుండా పోతుంది (చని పోయిన బాతులా). అలా అని కారు నిర్వహణమీద ఇంకో కారు కొనగలిగినంత ఖర్చు చేయడం కూడా పాడి కాదు. ఈ రెండింటి మద్య (P/PC balance) సమతుల్యం ఉండాలి.
మన ఉద్యోగ విషయంలో కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అప్పుడెప్పుడో సాధించిన డిగ్రీలతో, సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించి నెలవారీ జీతాలు తీసుకుంటూ వుంటే సరి పోదు. నిర్వహణ సామర్థ్యం పెరగాలన్నా లేదా కనీసం అదే స్థాయిలో ఉండాలన్నా మన skills కు పదును పెట్టుకుంటూ వుండాలి. అలాగని ఎన్నో skills వుండి కూడా వాటిని ఉత్పత్తికి ఉపయోగించక పోతే అవి నిష్పలం.

రేపు మొదటి అలవాటు (Habit 1) Proactivity గురించి.

— ప్రసాద్
 

దృక్కోణ మార్పు (paradigm shift)

జూలై 19, 2006

రెండోసారి 7 habits of higly effective people చదువుతున్నాను. క్రితంసారి ఎప్పుడో చదివాను. నాకు బాగా నచ్చిన విషయాలను ఇందులో ముచ్చటించాలనుకుంటున్నాను.

ఇందులో ఈ దృక్కోణ మార్పు గురించి చాలా బాగా చెపుతాడు. నిజమేంటో అది అట్లాగే ఉంటుంది కానీ వీక్షించేవాడి అద్దాలను బట్టి ఎవదికి వాడు వేరు వేరుగా అర్థం చేసుకుంటాడు అని చక్కటి ఉదాహరణలతో చెప్తాడు.

ఒకసారి రచయిత మెట్రో రైలులో ప్రయాణం చేస్తూ వుంటాడు. అంతా నిశ్శబ్దంగా ఎవరి పనిలో వాళ్ళున్నారు. పత్రికాపఠనంలో కొందరు, నిద్రలో జోగుతూ కొందరు. ఒక స్టేషనులో ఒక పెద్దాయన తన పిల్లలతో ఆ భోగీలోకి ఎక్కుతాడు. ఎక్కినదే తడవు ఆ పిల్లలు అల్లరి చేయటం ప్రారంబిస్తారు. గట్టిగా అరవటం, పరిగెత్తడం ఇలా నిశ్శబ్దాన్ని బంగం చేశారు. కానీ వళ్ళతో వచ్చిన ఆ పెద్ద మనిషి మాత్రం వాళ్ళని పల్లెత్తు మాట అనటం లేదు, తనదే లోకంగా వాళ్ళు చేస్తున్నది ఎరగనట్లుగా కూర్చుని వున్నాడు. సహజంగానే రచయితకు అతని మౌనం కాస్త ఇబ్బంది కలిగించింది. “మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, కాస్తా వాళ్ళని అదుపులో పెట్టడానికి ప్రయత్నించండి.” అని ఆ పెద్దాయనతో అన్నాడు.

అపుడా పెద్దాయన “క్షమించండి ఒక గంట క్రితమే వాళ్ళమ్మ చనిపోయింది, నేను దాన్ని గురించే ఆలోచిస్తున్నాను, ఈ పిల్లలు కూడా ఆ బాధనుండి బయటపడ్డం తెలియక అలా ప్రవర్తిస్తున్నారేమొ.” అంటూ ఆ పిల్లలని మందలించబోయాడు. రచయిత ఆలోచనా దృక్పధంలో వెంటనే మార్పు వచ్చింది. “అయ్యొయ్యో! పరవాలేదు, ఆడుకోనివ్వండి, మీకు నేనేమైనా సహాయం చేయగలనా” అన్నాడు.

ఇప్పటివరకూ పిల్లలు చేసింది అల్లరైతే విషయం తెలిసాక వాళ్ళమీద సానుభూతి, జాలి కలిగాయి.

పిల్లల అల్లరి నిజమే (reality) కానీ ఇంతకు ముందు అది అల్లరిలా అనిపిస్తే ఇప్పుడదే ఆటలా అంపించింది. ఇంతకు ముందు అసహనం, కోపం వస్తే ఇప్పుడు జాలి, కరుణ కలిగాయి.

దృక్కోణంలో మార్పు వచ్చింది.

అయితే ఈ మార్పు ప్రతిసారీ అంత సులఆఅంగా రాదు.

భూమి చదునుగా వుంది అని బండగా వాదిస్తున్నవారు ఇంకా వున్నారు (http://www.alaska.net/~clund/e_djublonskopf/Flatearthsociety.htm). రాజుకు మాత్రమే రాజ్యమేలే హక్కువుంది అన్న దృక్పధం నుండి ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే మార్పు రావటానికి కొన్ని వేల ఏళ్ళు పట్టింది.

రేపు ఇంకో విషయం ముచ్చటిద్దాం.

— ప్రసాద్

రాజ్యమా లేక ప్రియురాలా!

జూలై 5, 2006

రామచంద్ర రాసిన “హంపి నుండి హరప్పా దాకా” చదివేదాక ఈ అష్టమ ఎడ్వర్డ్స్ (Edwards VIII) గురించి నాకు తెలియదు.
ఈయన వలచిన ప్రియురాలి కోసం రాజ్యాన్నే వదులుకున్నాడు. తనే కాక తన సంతానానికీ ఆ హక్కు ఉండదని తెలిసి చక్రవర్తి పదవిని త్యజించాడు.
ఎంత ప్రేమమయుడు!!! ప్రేమ పిపాసి!!!
చక్రవర్తి పదవిని తమ్మునికి అప్పగించి తను చేసిన చివరి ప్రసంగము చదవండి.

http://www.royal.gov.uk/files/pdf/edwardviii.pdf

— ప్రసాద్

గమనాగమనం — gamanAgamanM

జూన్ 16, 2006

ఆలూరి భుజంగరావు గారి "గమనాగమనం" నుండీ కొన్ని పేరాలు.

కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో తను చుసిన దృశ్యం.
"
… ఆ గ్రామంలో తరచూ కనబడే దృశ్యం.
అక్కడి ప్రజలు మొగవాళ్ళు వారానికి రెండు మార్లు స్నానం చేస్తారు. ఆడవారు ఒక్కమారు స్నానం చేస్తారు. తండ్రి తొట్లో నిలబడి నీళ్ళు పోసుకుంటాడు. కొడుకు తండ్రి పోసుకున్న నీళ్ళు తనమీద పడేట్లు వంగుంటాడు. తండ్రి తన వళ్ళు తోముకుంటూ నీళ్ళు పోసుకొని కొడుకు వళ్ళూ కడుగుతాడు. ఆ మొత్తం నీళ్ళు తొట్లో పడగా పశువులకు పెడతారు. అక్కడి నీటి కరువుకు ఇది ఒక ఉదాహరణ.
"

కాయకష్టం చేసినా కడుపుకింత తినడానికీ, కంటికింత నిద్ర పోవటానికీ లేని దరిద్రపు ఆనవాళ్ళు ఎలావుంటాయో చూడండి.
"యుద్దపు సమయంలో గడియారాల్లో సమయాన్ని ఒక గంట ముందుకు తిప్పారు. అలా ముందుకు తిప్పబడ్డ సమయం ప్రకారం తెల్లవారుజామున మూడుగంటలకు నిద్రలేచి, చాకిరికి నడుం వంచి, ఐదు గంటల వరకూ పని చేసాక అప్పుడు రెంటికి పోవటనికి కొద్ది అవకాశాన్నిచ్చేవారు. అప్పటికి చచ్చే బడలిక, అలసట, నిద్ర మత్తు ఆవరించేవి నన్ను. నేరుగా మూడు కాలవలకు దొడ్డికి వెళ్ళినవాన్ని పాతవంతెన మీద ఆపళంగా పడి నిద్రపోయేవాడిని! మూడు కాలువల్లో మధ్య కాలువ వంతెన కొంచెం వెడల్పుగా వుంటుంది. మనిషి అటూ ఇటూ పొర్లకపోతే దానిమీద పడుకోవచ్చును. ఐతే నిద్రలో ఇటు దొర్లితే రోడ్డుమీద పడతాను; ఏ గుర్రబ్బండో, రిక్షానో మీదుగా వెళ్ళిపోయే ప్రమాదం వుంది. ఇంక అటు దొర్లితే నేరుగా కాలువలోనే పడిపోతాను. ఐనా, నిద్రలేమిని భరించలేక సంవత్సరాల తరబడి ఆ వంతెన మీద పడి నిద్ర పోయాను."

మానవత్వం మరిచి మనిషి చేసే వికృత చర్యలు యివి.
"నేనూ, ప్రకాశం – ఉపద్రష్ట వారి హోటల్ని కొనుక్కున్న చావలినివాసి పిచ్చయ్య హోటల్లో పనిచేస్తున్నాం. అదే హోటల్లో పనిచేసే పతికేళ్ళ యువకుడొకడు రోజూ సరుకులు పట్టుకొచ్చేవాడు బజార్నుండి. అలా తేవడంలో బేడో – పావలో మిగుల్చుకునేవాడు. ఈ విషయం ఎలాగో యజమానికి తెల్సింది. ఇంక ఆయువకుణ్ణి మేడమీద గదిలో పడేసి, మూడురోజులు అన్నం – నీరు ఇవ్వకుందా అమానుషంగా హింసించి నాలుగవరోజు పొద్దూకు మాట్ల గుడ్డలన్నీ వలిచేసి దిశమొలతో బైటకు నెట్టేశారు. ఇంక అక్కడుంటే చంపుతారన్న ప్రాణభీతితో దిశమొలతో, క్రిక్కిరిసిన నడిబజార్లో అతడు పరుగెత్తికెళ్ళిపోవడం ఈనాటికీ – మానసవీధిలో స్పష్టంగా చూడగలుగుతున్నాను."

వున్నవాడికి వస్తువు విలువ తెలీదు. వున్నవాడికి పనికిరాని వస్తువు కూడా లేనివానికి ఎంతో విలువైనదవుతుంది.
"చివరికి ఎలాగైతే యేం – ఓ ఉపాయం తట్టింది! ఒక రోజు సాయంకాలం నేనూ నటరాజన్ రత్నాటాకీస్ దగ్గరకు వెళుతున్నాము. వాడు తెలుగు కథల్ని గురించి చెప్తూ నడుస్తున్నాడు. నేను వింటూ నడుస్తున్నాను. నడుస్తున్నవాణ్ణి, రోడ్డు మీద పడెసి వున్న చార్‌మినార్ సిగిరెట్ పెట్టెను – ఖాళీదాన్ని – చూసి ఆగిపోయాను. వంగి దాన్ని తీసుకున్నాను; అలాంటి ఖాళీపేట్టెల లోపలిభాగం రాసుకోవటానికి వీలుగా ఉంటుందనిపించి! "ఎందుకురా అది?" అడిగాడు వాడు. ఖాళీపెట్టెను చించి పొడవుగా చేసి లోపలి భాగాన్ని చూపుతూ " దీనిమీద గురువుగారు చెప్పిన అర్థాల్ని – నోట్సునూ రాసుకుంటాను!" అన్నాను."

ఇంకా ఇలా ఎన్నో అలనాటి దృశ్యాల్ని వివరిస్తారు ఆలూరి భుజంగరావు గారు. ఇవి ఇప్పటికీ ఎన్నో కుటుంబాలలో సర్వ సాధారణమైనవి. చిన్నప్ట్నుంచీ మయని బట్టలు వేసి, ఆకలి అంటే తెలియకుండా పెరిగిన ప్రతి ఒక్కరూ సాటి బీదవారు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవాలంటే ఇలాంటి రచనల్ని చదవాలి.
టాగూర్ గీతాంజలి, చలం ప్రేమలేఖలూ చదివాలి కాని బీదవాడి జీవితాన్ని చదవటమే, బీదవాడికి సహాయం చేయటమే అసలైన దేవతారాధన, సాహిత్యారాధన. అదే సిద్దికీ మోక్షానికీ ఏకైక మార్గము.