Archive for the ‘వర్తమానం’ Category

ఎందుకీ బానిసబుద్ది!

సెప్టెంబర్ 11, 2006

మన నరనరాల్లో బానిసబుద్ది జీర్ణించుకుపోయింది. జీ హుజూర్, బాంచెన్ కాల్మొక్త! అనేవి మన రక్తంలోనే వున్నాయి. ఎవడో ఒకడికి మనల్ని మనం అర్పించుకొంటేనే గానీ ముక్తి రాదనే భ్రమలో కూరుకుపోయాం. మనకు వాడూ గొప్ప అని మనం ఎదుటి వాన్ని పొగిడి, ఆరాధించి, కొలిచి సంతృప్తి పడాలని పిస్తుంది. “మా కాలంలో ఆ జమిందారు…ఆయన సోయగం… ఆ రాచటీవి …” ఇలా మన పూర్వపు జమిందారుల వైభవాన్ని, రాజుల గొప్పదనాన్ని నోరార చెప్పుకొంటేగానీ మనకు కడుపు నిండదు.

ఈ విశ్వాసంతో బతకడం చాకలి దగ్గర గాడిదలా, రైతు దగ్గర కుక్కలా అంటే మనకు భారతీయులకు అందునా తెలుగు వాళ్ళకు మహా ప్రీతి.
నాకు కె.విశ్వనాథ్ సినిమాలంటే చాలా ప్రీతి. కానీ శుభసంకల్పం చూడండి. అందులో కమల్‌హాసన్ పాత్ర చూడండి. ఆ విశ్వాసం చూస్తే నాకు ఎగటు పుట్టింది. మీలో చాలా మంది నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ నాకెందుకో ఆ అతి వినయం, అతి విశ్వాసం, రాజ భక్తి నాకు నచ్చ లేదు. నాకైతే అది కుక్కలా పడి వుండే విశ్వాసం అంపించింది.

ఇప్పుడు ఈ రాజశేఖరుని చూడండి. ఎంత వల్లమాలిన ప్రేమ వుంటే మాత్రం అవకాశం దొరికితే ఆంద్రప్రదేశ్‌ని ‘ఇందిరాప్రధేశ్’ గానో ‘రాజీవ్‌ప్రధేశ్’ గానో పేరు మార్చేట్లున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోలేనప్పుడు వాడెవడో మనల్ని గౌరవిస్తాడనుకోవడం ఒట్టి భ్రమ.
నిన్న జెమినిలో ‘బంగారం మీకోసం’లో ఒక ప్రశ్న. “మేఘమధనం’ ప్రాజెక్టు పేరేమిటి అని. దాని పేరే మేఘమధనం కదా ఇంకా పేరేమిటబ్బా అనుకొని, ఇంకేమయ్యుంటుంది ‘ఇందిరా మేఘమధనమో’ రాజీవ్ మేఘమధనమో’ అనుకున్నాను లోలోపల. అంతే నేననుకున్నదే సరైనది. జవాబు “ఇందిరా మేఘమధనము”.
నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మనకింతకంటే మహామహులు లేరా? ఆయనకున్న రాజభక్తిలో మనమందరం కూడా మునిగితేలాలా? రాజీవ్ విమానాశ్రయం, ఇందిరమ్మ పధకం, రాజీవ్ గడ్డి తినే పధకం, ఇందిరా గోళ్ళు కొరుక్కునే పధకం.. ఇంకేం పేర్లు లేవా? తెలుగు దేశం వాళ్ళు ఎంత నయం, అన్న గారు సంస్కృతాంద్రం లో పేర్లు పెడితే బాబు ‘వెలుగూ, ‘దీపం’, ‘జన్మ భూమి, ఇలా అచ్చ తెలుగు పదాల్లో పధకాల పేర్లు పెట్టాడు.

ఈ కాంగిరేసొల్లకి ప్రజలమీద భక్తి కంటే రాచరికభక్తి ఎక్కువ, సేవలో తరించిపోదామనే ఆర్తి ఎక్కువ! అమ్మా సోనియా నీ పాదధూళి సోకినా మా జన్మ ధన్యం అంటూ సాగిలపడతారు. ఆ మధ్య పంచాయితీ ఎన్నికలయ్యాక సర్పంచులు ముఖ్యమంత్రిని కలిసే సీను చూశాను. చిన్నా పెద్దా అని వయసు తేడా కూడా చూడకుండా కాళ్ళమీద సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి నివ్వెరపోయా! ఎంత ప్రజాస్వామ్యదేశమైనా యుగాల రాచరిక వాసనలు ఎలా వదుల్తాయి అంత గమ్మున? ఎంత ప్రభుభక్తి! ప్రజలమీద నమ్మకమున్నవాడు అలా సాగిలపడి నమస్కరించాల్సిన అవసరముందా?

ఇక పోనీలే ఎవడి పిచ్చి వాడిది, ఎవడి భక్తి వాడిది అని వొదిలేద్దామంటే పుట్టపర్తి విగ్రహం తీసేసి ఇందిరమ్మ విగ్రహం, వేమన విగ్రహం తీసేసి రాజీవ్ విగ్రహం పెట్టేస్తే ఎలా? రేపు హైదరాబాద్ పేరు కూడా ఇందిరా నగర్ అని పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఎవడి పిచ్చి వాడితో వుంటే ప్రమాదం లేదు కానీ ఆ పిచ్చితో మనల్ని కరిస్తే మాత్రం ప్రమాదమే!

— ప్రసాద్

సద్వినియోగము

ఆగస్ట్ 30, 2006

వేల ఏళ్ళ మానవ చరిత్రలో ఒక మనిషి జీవితము అత్యల్పము. ప్రతి మనిషి జీవితము తన తర్వాతి తరానికి మరింత మంచి జీవితాన్ని ఇవ్వడానికే ఉపయోగపడాలి. కానీ జరుగుతున్నది వేరు.
మనకున్న ఈ స్వల్ప జీవితకాలాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా? అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం సంతృప్తిలేని సమాధానం మనకు ఎదురవుతుంది.
పది డాలర్లు పెట్టి సినిమా చూసి, మూడు గంటలు వృధా చేసి బాగలేదంటూ నిట్టూరుస్తాం. ఆ పది డాలర్లతో పదిమంది పొట్టలు వారం రోజులు నింపవచ్చు. ఎక్కడ సద్వినియోగమవుతుందో తెలుస్తూనే వున్నా దుర్వినియోగం వైపే మనసు ఆరాటపడుతుంది. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా మళ్ళీ ఇంకోటి మన చిన్నోడికి, కానీ అదే బొమ్మ కడుబీదవాని పిల్లాడికిస్తే వాడి కళ్ళల్లోని మెరుపులు! మనం ఇంతేకదా అనుకునే డబ్బు కూడా మహత్యాలు చేస్తుంది అవసరమయినచోట, కానీ అవసరం లేని చోటే ఆరాటపడుతుంది మనసు.
పుట్టినరోజు వేడుకలు, పెళ్ళి వేడుకలు, దీపావళి, దసరాలు ఎన్నెన్ని వృధా ఖర్చులు. నింపినవాడి పొట్టనే మళ్ళీ నింపుతాం. వేడుకకు రాలేదంటూ మన తోటి వుద్యోగినో, బందువునో నిష్టూరమాడతాం, మన పెళ్ళింటి ముందరే తచ్చాడుతున్న బిచ్చగాన్ని అరిచి తరిమేస్తాం! తినింది అరక్క శరీరమంతా కొవ్వుపేరుకున్న వాని కొవ్వు పెంచడానికి చేసే ఖర్చు సద్వినియోగమా? ఒక్క పూటకైనా సరైన తిండి తిని ఎరుగని అభాగ్యుని ఆకలి తీర్చడానికయ్యే ఖర్చు సద్వినియోగమా?
ఇలాంటి ఖర్చు ఎంత చేయగూడదనుకున్నా మళ్ళీ ఆ వుచ్చులోనే పడ్డాను. తీరినవారి ఆకలే తీర్చడానికి ప్రయత్నం, వున్నవాళ్ళ ముందర వున్నవాళ్ళమనిపించుకోవాలని ఆరాటం. ఎంత ఖర్చు! దానితో కనీసం రెండు గుండెలకు జీవం దక్కేది, లేదా మా వూరికి ఏడాదిపాటు వైద్యం దక్కేది.
ఒక మేడ వున్నవాడు ఇంకో మేడ కట్టడం సద్వినియోగమా? గుడెసైనా లేని వాడికి గుడెసెనివ్వడం సద్వినియోగమా?
సమయమూ అంతే, ఎన్ని పనులున్నా శనివారం వేంకటేశ్వరుని గుడికో, గురువారం సాయిబాబా గుడికో వెళతామే గానీ ఇంటి ముందర పేరుకుపోయిన చెత్తను తీయడానికి అరగంట కేటాయించలేం. సాయిబాబా అంటే గుర్తొచ్చింది.. ఆయన భక్తులు ఆయనకు బంగారు సింహాసనాన్ని చేయిస్తున్నారట! కడు సాధారణంగా ఒక పాడుపడ్డ మసీదులో సాధారణ జీవితాన్ని గడిపిన ఆయనకు కనకపు సింహాసనం కావాలా? ఆయన కోరుకుంటే కూర్చోలేక పోయేవాడా? సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన జీవితాన్ని మనం పాటించక, ఆయన బోధలకే విరుద్దంగా ఆయన్ను కనకసింహాసనాలెక్కించి కుబేరులు ఆయన్ను కుబేరుని చేస్తున్నారు, దేవుడున్నాడని చెప్పని బుద్దున్ని దేవున్ని చేసినట్లు! ఆ ఖర్చుతో షిర్డిని సుందరంగా చేస్తే బాబా సంతోషించడా? బీదవాళ్ళకు నివాస గృహాలో,  పిల్లలకు పాఠశాలలో, అనాధలకూ వసతులో ఎన్నిలేవు చేయడానికి, ఎన్ని మార్గాలులేవు మనల్ని వ్యక్తీకరించుకోవటానికి? వుహు! ఏ బాబా వీటికి వ్యతిరేకం కాదు కానీ మనం వీటిని చెయ్యం. చేసినా అరకొరగానే!
గుడి బయట సచేతనంగా చేతులు చాపే దేవున్ని కాదని జీవంలేని రాతినే దేవుడని, తినలేని రాయి ముందు తినమని ప్రసాదాలు పెట్టి, మానావమానాలు లేని విగ్రహానికి పట్టువస్త్రాలు కట్టి, ఊరేగింపులు, అగరొత్తుల పరిమళాలు…. ఒకటేమిటి జీవమున్న మనిషి కంటే మిన్నగా చూస్తాం!
వీటన్నిటికి మన విలువైన సమయాన్ని వృధా చేస్తాం!
ముంబయిలో గణేశుడికి 60 కిలోల బంగారు ఆభరణాలట! మురికి వీధుల్లో కూడా ఎత్తైన వినాయకుడు జిగేళ్‌మంటూ కళ్ళుమెరిపిస్తాడు. వీధిని బాగుచేయాలని ఎవడికీ వుండదు. దానికోసం ఎవ్వరూ చందాలడగరు, అడిగినా ఇవ్వరు, ఇవ్వాలనుకున్నా వాలంటీర్లు దొరకరు!
ఇన్ని పండుగలు చేస్తాం, ఇంత ఖర్చు పెడతాం, ఈ పండుగలకని బోలెడన్ని సెలవులు పెట్టి మరీ పనికొచ్చే పని ఒక్కటీ చేయం. ఎందుకని వీధుల్ని శుబ్రం చేసే పండుగ లేదు? ఎందుకని ఒక్కరోజైనా తల్లిదండ్రులు లేని అనాధకు తిండిపెట్టే పండుగ లేదు? ఎందుకని లేని వాడికి వున్నవాడిచ్చే పండుగ లేదు?
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే జీవితంలో 99 శాతం వృధా అవుతోంది అనిపిస్తోంది.
— ప్రసాద్

అశృతర్పణం

ఆగస్ట్ 22, 2006

ఆ మహా స్వరార్చకుడు మనల్ని వీడి వెళ్ళాడు.
అప్పుడెప్పుడో గొల్లపూడి రాసిన ఒక వ్యాసం చదివి కాశీ కంటూ వెళితే విశ్వనాధున్ని కాదుగానీ బిస్మిల్లా ఖాన్ గారినే దర్శించుకోవాలి, అర్చించుకోవాలి అనుకొన్నా. నా కోరిక తీరనిదైపోయింది. ఎన్నో రాగాలూదిన శ్వాస శాశ్వతంగా మూగపోయింది. ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా స్రవిస్తూనే వున్నాయి నా కన్నులు.

Americans are now recognizing the tricolor flag with wheel at the center

ఆగస్ట్ 18, 2006

NASDAQ celebrates India's Independence Day

bmp చిత్రాన్ని wordpress కి ఎగుమతి చేయలేకపోయాను. పెద్దబొమ్మ చూడాలంటే నా వెబ్‌సైటు చూడండి.

11 వ తారీఖు

ఆగస్ట్ 16, 2006

చదువరి బ్లాగు చూశాక అనిపిస్తోంది ఈ “Al queda” కి 11 వ తారీఖు మంచి రోజేమొ అని. ఇక నుంచి భద్రతను ఆగష్టు 15 లేదా జూలై 4 న పెంచకుండా ప్రతి నెలా 11 వ తారీఖు భద్రతను పెంచాలేమొ!
సెప్టెంబర్ 11, మార్చి 11, జూలై 11.
మొన్నటికి మొన్న బ్రిటన్ లో అరెస్టులు జరక్కపోయి వుంటే వాళ్ళు కూడా ఆగష్టు 11 న తమ పని కానిచ్చేవాళ్ళేమొ అని నాకనిపిస్తోంది. ఈ ఆలోచన ఇంటెలిజెన్స్ వాళ్ళకు వచ్చిందో లేదో!

భలే మంచి అవకాశం!

ఆగస్ట్ 4, 2006

వాళ్ళు దిక్కరించారు గనక మేమూ దిక్కరిస్తాం. వాళ్ళు అగ్గిలో దూకారు గనక మేమూ దూకుతాం. ఇదీ ఇప్పుడు మన నాయకుల వరస. గణేష్ నిమజ్జనానికి తెలంగాణా అవతరణకూ ముడిపెడుతున్న ఈ నరేంద్ర అందరినీ తలదన్నేశారు. ఒద్దురా నాయనా సాగర్ కాలుష్యమైపోతోంది అంటే వైస్రాయ్ హోటల్ చేయట్లేదా అంటాడు, మక్కా మసీదులోపలే చేయకుండా బయట నమాజు చేసి హైకోర్టును దిక్కరించలేదా అంటున్నాడు. ఈయన TRSలో చేరినా RSS వాసనలు పోవట్లేదు. ఈ RSS వాసన అంటుకున్నవాళ్ళకు అది ఆజన్మాంతమూ వుంటుంది. కాకపొతే నరేంద్ర దాన్ని తెలంగాణకు అన్వయిస్తే అంబనాధ్  తెలుగు నాడు కి అన్వయిస్తారు అంతే తేడా. ఇప్పుడు మతాభిమానాన్ని తెలంగాణా వేర్పాటువాదానికి ఎంత చక్కగా వాడుకోవాలనుకుంటున్నాడో చూడండి. మత కల్లోలాలూ జరగొచ్చు అంటూ ముందే వంద శాతం నిజాయితీతో మూర్ఖంగా పనిచేసే మత పిచ్చి గాల్ల ని ఉసిగొల్పడానికి సిద్దమవుతున్నాడు. అడ్డుపడుతున్నది కోర్టు, అక్కడే గణేషుని ముంచుతామంటున్నది మీరు మద్యలో ఈ మత కలహాలు ఎందుకు రావాలి? ముస్లిములు అడ్డుపడలేదే!
రాముడు మునిగిపోతాడని ప్రాజెక్టులు కట్టొద్దు, కాలుష్యమవుతుందని నిమజ్జనము ఆపొద్దు. ఏం హుస్సేన్ సాగర్ లోనే ముంచమని అలిగాడా వినాయకుడు?

నాకీ MS ఎందుకో నచ్చేస్తున్నాడు!

జూలై 28, 2006

అప్పుడప్పుడూ మరీ పచ్చిగా మాట్లాడి బెదరగొట్టేస్తున్నా ఫరవాలేదనిపిస్తున్నాడు. కాంగిరేసు మాంత్రి అయివుండీ బాబును పొగడటం, ఎదుటిపక్షము వాళ్ళు తప్పును తప్పుగా ఒప్పుకోవటం ఈ కాలం రాజకియనాయకుని లక్షణం కాదే!
http://www.eenadu.net/story.asp?qry1=1&reccount=25

హద్దూ, అదుపూ లేని ఇజ్రాయెలు

జూలై 28, 2006

మొత్తం మీద ఇప్పుడు అమెరికాకు ఎదురు చెప్పే పరిస్తితి ఎటువైపు నుంచీ, దూరంగా కూడా కనిపించట్లేదు. బూషయ్య నీతిలో రెండే వర్గాలు, అమెరికాతో వున్నవారు (aka మిత్రులు) అమెరికాతో లేనివారు (aka శత్రువులు). ఇక అలీన దేశాలు, అలీన సిద్దాంతము అటకెక్కినట్లే కదా! అంతో ఇంతో అశక్తి రాజ్యాల తరపున మాట్లాదుతున్న ఇండియా కూడా అణు ఒప్పందము, ఐక్యరాజ్యసమితిలో శాశ్వతసభ్యత్వము లాంటి కోర్కెలకై అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడలేకున్నది. తనతో వుండటమో, తనకు వ్యతిరేకంగా వుండటమో అనే రెండే గ్రూపులు కనుక ఇండియా కూడ తనతో వుండటానికి నిశ్చయించుకొన్నట్లుంది. పెళ్ళయ్యాక పెళ్ళాం మాటకు కూడా విలువనియ్యాల కదా, అది మంచిదైనా, చెడ్డదైనా, ఇండియా పరిస్తితి అలాగే వుంది. అమెరికా పద్దతి బాగాలేదని తెలిసినా వియ్యమందాలంటే దాని తప్పుల్ని చూసిఛూడనట్లుండాల్సిందే కదా.
చూడండి ఇజ్రాయెలుకు ఎలా వంత పాడుతోందో. మాట వరసకైనా అమాయకప్రజల మీద దాడులు ఆపమని చెప్పట్లేదు. పైగా యూరోపియన్ యూనియన్‌తో కూడా తన మాటనే అనిపించేసింది. నల్లులు తనతో వున్నందుకు మంచానికీ దెబ్బలు తప్పనట్లే, ఈ తీవ్రవాద మూకలు తమతో వున్నందువల్ల అమాయక ప్రజలకీ తిప్పలు తప్పట్లేదు. కానీ ఈ అన్యాయాన్ని చూస్తూ కూడా ప్రపంచదేశాలు ఎలా మూగనోము పట్టాయో చూడండి. ఈ అరబ్బుదేశాలది ఇంకో పాట. తీవ్రవాద మూకలని నొప్పించడానికి అసలు మాట రాదు. అసలు వాళ్ళ బలమంతా వీళ్ళేగా! ఈ దేశాల సహాయం లేనిదే హిజబుల్లా లాంటి వాళ్ళకి రాకెట్లూ, బాంబులూ ఎలా దొరుకుతాయి.
అనువుగాని చోట అధికుల మనరాదన్న నీతి ఈ మిలిటెంట్ మూకలకూ తెలియదు. వెళ్ళి వెళ్ళి సింహం తోక పుచ్చుకు లాగుతారు, అది ఇదే అదనని మొత్తాన్నే మింగేస్తుంది. అదేమన్న ఇండియా లాంటి వేదాలు వళ్ళించే పవిత్ర గోవు లాంటిదా, ఎంతమంది పౌరులు, సైనికులు చనిపోయినా హెచ్చరికలతో సరిపెట్టడానికి?
అసలు ఈ రాళ్ళ కుప్పలతో, AK47లతో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆపగలమని ఎలా అనుకుంటారో! తమలపాకుతో నీవొకటంటే తెడ్డుకట్టెతో నేరెండంటా అనేరకం కదా ఇజ్రాయెల్.
హెచ్చరించే వాడు లేడు, బలంలో సరితూగే దేశమేదీ చుట్టుపక్కల లేదు, ఇక దానికి హద్దేముందీ! ఇలా గాయపడుతున్న చిన్నపిల్లలు రేపు మిలెటెంట్ నాయకులయి ప్రతీకారం తీర్చుకోవటానికి ఎదురుచూడరని గ్యారంటీ ఏమిటి?
ఈ పిల్లీ ఎలుకా ఆట ఇలా సాగుతూ పసిపిల్లలనీ, అమాయకులనీ కాల్చేస్తుంటే రోజూ యుద్దవార్తలు చదివి నిట్టూర్చడం తప్ప ఏం చేయగలం.
హింసకు హింసే సమాధానమనే ఈ ఇరుపక్షాలకూ చివరికి హింస ఏమీ మిగలదు.

ఆరో వేతన సంఘమట!

జూలై 20, 2006

ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. మొన్న మొన్ననే నడ్డి విరిచిన అయిదో వేతన సంఘం జ్ఞాపకాలు మరుగున పడక ముందే ఆరో వేతన సంఘము వచ్చేస్తోంది. ఠంచనుగా ప్రతి నెలా జీతాలు అందుకునే ఉద్యోగుల జీతభత్యాలు పట్టించుకునే వారే గానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు, దినసరి కూలీలకు పట్టించుకునే వారేరి? ఈ వేతన సంఘాలు జీతాలు పెంచిన ప్రతిసారీ ద్రవ్యోల్బణం పెరిగి ముందే కష్టాలలో ఉన్న వారి వెతలు మరింతగా పెరిగిపోతున్నాయి. వాళ్ళకు నెలసరి రాబడి గ్యారంటీ చేసేదెవరు?
విపరీతమైన IT జీతాలే బీదల్ని మరింత దూరంగా ఉంచుతున్నాయంటే ఈ వేతన సంఘాలు తమ వంతు భాద్యత తీసుకుంటున్నాయి.
MP లు తమ జీతాలు, అలవెన్సులు తమ ఇష్టం వచ్చినట్లు పెచ్చుకుంటారు. MLAలు తమ జీతాలు, భత్యాలకు తోడుగా ఖరీదైన నగరాల్లో ఇళ్ళ స్థలాలు కూడా కేటాయింపజేసుకుంటారు.
బీదవాడి వేతన ఎవరికి పట్టింది. ఏరుగాలం కాయకష్టం చేసే రైతుకు ప్రకృతి కొంత అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు, వేతన సంఘాలు వీలయినంతమేర వాళ్ళ కష్టాల్ని పెంచుతున్నాయి.

— ప్రసాద్

పల్లె ప్రజలు అమాయకులా?!

జూలై 17, 2006

హు..నేనూ పల్లెనుండే వచ్చాను. నాకైతే వాళ్ళు అమాయకులు కాదనే అనిపిస్తుంది. కాకపోతే అజ్ఞానులు అనవచ్చు. పట్టణాలలో ఉన్నవారికున్నంత ప్రపంచజ్ఞానం లేకపోయినంత మాత్రాన వాళ్ళు వుట్టి అమాయకులేం కాదు. స్వాతిముత్యం సినిమాలో కమల్‌హాసన్ పాత్ర వుందే అదీ అమాయకమంటే. అమాయకులంటూ వుంటే వాళ్ళు పల్లెల్లోనూ వున్నారు, పట్టణాల్లోనూ వున్నారు.
కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, మోసం, దగా అన్నీ వారికి తెలిసినంతలో వాళ్ళు చేస్తూనే వుంటారు. కాకపోతే వాళ్ళ పరిమితమైన జ్ఞాన పరిధి వల్ల కోలా కృష్నమోహన్ లాగానో, కృషి వెంకటేశ్వర్లు లాగానో మోసం చేయలేరంతే! అవకాశం దొరకక దొరల్లా (అమాయకుల్లా) మిగిలిపోతున్నారంతే!

ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు కదా! మా ఊరూ ఒక చిన్న పంచాయితీయే. మా అన్నయ్య వెళ్ళి ఉరి అందరినీ సమావేశ పరిచి ఎవరికి సర్పంచిగా నిలబడాలనుందో, వాళ్ళు ఊరికి ఏమి మేలు చేద్దామనుకుంటున్నారో అడిగాడట. నిజమే వాళ్ళెంత అమాయకులంటే నిలబడితే ఊరికి చేయడమేమిటి, మమ్మల్ని గెలిపిస్తే ఊరికి లక్ష ఇస్తానని ఒకడంటే, లక్షన్నర ఇస్తానని ఇంకొకడు. అందరికీ పొట్టేళ్ళతో విందు పెడతానని ఒకడంటే, సారాయి కూడా పోయిస్తానని ఇంకొకడు! నేను పోయిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయా గనుక ఈసారి నన్నే గెలిపించాలని ఒకడు, నేనూ MPTC ఎన్నికల్లో ఓడిపోయాను గనుక నన్ను సర్పంచినైనా చేయాలని ఇంకొకని ఏడుపు.

పోనీ వింటున్న మన ప్రజల్లోనైనా ఇది తప్పు అన్న స్పృహైనా వుందా? అనుమానమే. వాళ్ళక్కూడా ఎక్కువ ఎవడిస్తాడనే. ఎవడు సర్పంచి అయినా వాళ్ళకు పట్టదు, దాని పేరు చెప్పి డబ్బులిస్తున్నారంటే ఎంతో సంతోషము! ఎంతో హడావుడి, హంగామా. ముచ్చట్లకు బోలెడంత ముడిసరుకు.

అలా కాదు, పల్లెకు ఎవరు ఎక్కువ పనులు చేసిపేడతారో, అసలు సర్పంచిగా ఏం చేస్తారు అంటే ఒకరిమీద ఒకరు అరుచుకోవటం ఎవరిపాటికి వాళ్ళు శాసనసభలోలా మాట్లాడటం తప్ప ఏమీ చెప్పలేరు. ప్రతి ఒక్కడి ఉద్దేశ్యమూ ఒకటే, ప్రతిష్ట, అంతో ఇంతో సంపాదించుకోవడం. ఆ మద్య ఓ సర్పంచు మధ్యాహ్నభోజన పథకపు బియ్యాన్ని తోకున సారాకొట్టు బాకీ కింద చెల్లేస్తుంటే, అది సర్పంచిగా వాడి హక్కు అనుకొన్నారే గానీ నోరు ఒక్కరూ మెదపలేదు. మెదపడానికి శక్తి లేక కాదు, వాడేం చేసుకుంటే మనకెందుకు? మన బియ్యం కాదుగా అనే నిర్లిప్తత!

ప్రజాస్వామ్యం, కలిసి నిర్ణయించడం, మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించడం తెలియనన్నాళ్ళూ ఈ స్థానిక ప్రభుత్వాలతో ఊర్లలో గ్రూపులు ఏర్పడడం, కక్షలూ కార్పణ్యాలూ హత్యలకు దారితీయడం మినహా అభివృద్దికి దారితీస్తుందనుకోవడం అత్యాశేమో!

— ప్రసాద్