Archive for the ‘ఆధ్యాత్మికం’ Category

దేవుడి పుట్టుక

ఆగస్ట్ 31, 2006

రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు.
నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ ఒకేలా చల్లదనాన్ని ఇచ్చినట్లు. ఆ శక్తికి మంచి, చెడ్డా విచక్షణ తెలియదు. పసి పాపకి, వృద్దుడికి తేడా తెలియదు. ఈ విశ్వమంతా కొన్ని భౌతికసూత్రాలమీద ఆధారపడి వుంది. ఆ సూత్రాలే దేవుడనుకొంటాను.
ఇప్పుడు ఆ దేవుడి పుట్టుక ఎప్పుడు అంటే ఏమనాలి? దేవుడికి పుట్టుక లేదు. ఆది అంతాలు లేవు. ఈ దేవుడు ఎప్పుడూ వున్నాడు, కాలం ఎప్పుడూ వున్నట్లు. దేవుడిని నీవు గుర్తించినా గుర్తించకున్నా దేవుడున్నాడు. నీవు గుర్తించిన రోజు దేవుడు పుట్టినట్లు కాదు. న్యూటన్ కనుక్కోక ముందూ గురుత్వాకర్షణ వుంది తర్వాతా వుంది. అది కనుక్కోబడిందే కానీ తయారుకాబడలేదు, సృష్టింపబడలేదు. దానికి పుట్టుక లేదు. అలాగే అంతమూ లేదు. రేపు మానవ జాతి అంతా అంతమైనా అది వుంటుంది. దాన్నే సత్యము అని కూడ అనొచ్చు. ఏది మార్పు చెందదో, ఎప్పటికీ నిలిచి వుంటుందో అది సత్యము. దానికి ఆది అంతాలు లేవు. వేదాలు గురించి ఇలాగే అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది రాయబడిన వాటి గురించి కాదు ప్రవచించబడిన ధర్మాల గురించి. ధర్మము ఎప్పుడూ ధర్మమే మనిషి పుట్టకముందునుంచీ, మనిషి నశించి పోయాక కూడా!

ఇక రూపము! నా దేవుడికి రూపం లేదు. అయినా ప్రతి దానిలోనూ చోడొచ్చు. శక్తి కనపడదు, దాన్ని అనుభవించాల్సిందే! గాలిని స్పర్షాజ్ఞానముతో తెలుసుకున్నట్లు. ప్రతి శక్తీ దేవుడే, ప్రతి జీవీ దేవుడే. ఈ సకల చరాచరాలలోనూ దేన్నీ అతన్నుంచీ మినహాయించలేము. జలచరాలన్నీ ఎలా సముద్రంలోనే వుండి సముద్రం రూపాన్ని చూడలేవో అలానే మనమూ దేవుడిలోనే వుండి అతని రూపాన్ని చూడలేము. ఎల్లలు లేని రూపాన్ని, ఊహకు కూడా అందని దూరాన్ని ఎలా అదిగమించి రూపాన్ని చూడగలం! అయిటే ఈ కనిపించేదీ, కనిపించనిదీ, నేను, నువ్వూ అందరం దేవుడిలో భాగమే! ఎక్కడయితే ప్రాధమిక భౌతిక సూత్రాలు న్యాయమౌతున్నాయో అవన్నీ కూడా దేవునిలో భాగమే! రెండు రెళ్ళు నాలుగయ్యే ప్రతిచోటూ దేవుడే!

ఇక అంచెలంచెలుగా ఎదగడానికేముంది. సర్వ వ్యాపితమైనవాడు, పుట్టుక, నశింపు లేనివాడు ఇక పెరిగేదెలా? పెరగడానికి ఇంకేం మిగిలివుంది? పుట్టడం, పెరగడం, నశింపచడం నిర్దేశించే దేవుడికే పుట్టుక వుంటే, పెరుగుదల వుంటే మరి ఆ దేవుడి పుట్టుకకు ముందు ఏమున్నట్లు? వుందడం, వుండకపోవడమనేవి రెండూ దేవుడి భిన్న పార్శ్వాలే అయితే ఇక దేవుడు సృష్టికి ముందూ వున్నట్లే కదా!

— ప్రసాద్

భక్తి అంతా మూర్ఖత్వమేనా?

ఆగస్ట్ 31, 2006

నాగరాజా గారి “భక్తి అంతా మూర్ఖత్వమేనా?” అన్న ప్రశ్నకు సమాధానంగా.

నాగరాజా గారూ, నా దృష్టిలో పరులకు వుపయోగపడని భక్తి ఖచ్చితంగా మూర్ఖత్వమే! “మానవ సేవే మాధవ సేవ”; భగవంతుడు జీవులన్నింటిలోనూ వ్యవస్థితమైవున్నప్పుడు జీవిని వదిలేసి రాయిని పూజించడం మూర్ఖత్వము కాక మరేమిటి? దేవుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటానికి అవి పనిముట్లు మాత్రమే, అవే దేవుళ్ళని నానా యాగీ చేయడం ఖచ్చితంగా మూర్ఖత్వమే! జెమిని టివి లో ఏ ఉదయం చూసినా అయ్యప్ప స్వామిని పూనకంతో పూజించేవాళ్ళను చూడవచ్చు. కాసేపు అయ్యప్ప స్వామి మీద భయాన్ని, భక్తినీ వదిలేసి ఆలోచించండి అది మూర్ఖంగా అనిపించట్లేదా? అంబనాధ్ అన్నట్లు (ఆయన భారతీయత గురించి అన్నారులెండి) మనం చిన్నప్పట్నుంచి ఆ మాటకొస్తే తరతరాల్నుండి అలా condition చేయబడ్డాం. ఆ నెల దీక్ష ఏదో పది మందికి వుపయోగపడేలా వుండవచ్చు కదా?
ఇక సతసాయి, అమృతానందమయి లాంటి వాళ్ళు చేస్తున్న సమాజసేవ నాకు తెలుసు. అందుకే వాళ్ళు చేస్తుంది మాయా, మంత్రమా నాకనవసరం. వాళ్ళు దేవుళ్ళా అంటే అవును దేవుళ్ళే అనాలి. అయితే దివ్యాంశాలుండే దేవుడు కాదు, దివ్యాంశలే వున్నట్లయితే అంత ఖర్చు పెట్టి ఆ ఆసుపత్రి ఎందుకే ఆయన తదిమిందే తడవుగా రోగాలు మాయమవచ్చు కదా! పకృతి సూత్రాలకు విరుద్దంగా ప్రవర్తించడం ఎవరికీ సాధ్యం కాదు, గొంతులోంచి లింగం తీసే దాంతో సహా! కానీ ఇంతకుముందు “పూజలు యజ్ఞాలు అవసరమా” అనే ప్రశ్నకు నేను రాసిన బ్లాగులో చెప్పిన తొండ కథలా, ఎదో విధంగా మనిషిలో నమ్మకం కలిగించాలి, నమ్మకం వున్నంతవరకే ఆయన చెప్పినది సత్యమని నమ్ముతారు. అయితే తొండ కథలోలా నమ్మకం ఎలా కలిగించాడు అనేదానికంటే రోగం కుదిర్చాడా లేదా అన్నదే ముఖ్యం.
ఆ విధంగా చూస్తే ఆయన సాధించినవి అద్బుత విషయాలే! ఎడారి జిల్లాలో ఒక కుగ్రామాన్ని పట్టణం చేయగలిగాడు, ఎందరో పేదలకు వైద్యసౌకర్యం కలిగించగలిగాడు, ఎన్నో పల్లెలకు నీటి సౌకర్యం కలిగించగలిగాడు. ఇంకా ఆయన భక్తులు భక్తులు ప్రపంచమంతా ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు.
నేను చెప్పొచ్చేదేమిటంటే మంచికార్యాలు చేయడం ద్వారానే మనం దేవుడి అభిమానాన్ని సంపాదించుకోగలం (మీరు దేవుని నమ్ముతున్నట్లయితే) అతని చుట్టు భజన చేసి, దండకాలు పఠించి, కాకా పట్టడం వల్ల కాదు.
ఒక మంచి యజమాని దగ్గర అతనికి నచ్చినట్లుగా పనిచేయడం వల్ల అతని ప్రీతి పొందగలము కానీ అతని వెనకాల వుండి వందిమాగధునిలా పొగడడం వల్ల కాదు. ఈ భూమి, విశ్వం, వున్నదీ లేనిదీ, చెట్టూ పుట్టా అన్నీ అన్నీకూడా ఆయన పెరడు, ఆయన ఆటస్థలం, నాటక స్థలం. ఈ జీవులన్నీ కూడా ఆయన పుత్రులో పౌత్రులో లేదా ఆయన అంశలో. వీటికి సేవ చేయడం ద్వారా, ఈ ఆటస్థలాన్ని శుబ్రంగా వుంచటం ద్వారా, జీవులన్నీ పరస్పర సహకారముతో జీవించడం ద్వారా కదా ఆయన అభిమానాన్ని పొందగలం! అది వదిలేసి అతని చుట్టుచేరి లేదా ఆయన ఫోటోనో, ప్రతిమనో పెట్టి పూజించి డప్పులు కొట్టి, అలంకారాలు చేసి, నినాదాలు చేసి (రాజకీయనాయకులకు జిందాబద్‌లు కొట్టినట్లు.) …. ఇదా నిజంగా సత్యవంతుడైన, నిజాయితీ గల దేవున్ని తృప్తిపరిచే మార్గం?
రాజుకు వందిమాగధులు చేసే పనా మనం చేయాల్సింది?
మూర్ఖత్వం కాదా యిది?

— ప్రసాద్

దేవుడు అని ఎవరిని చూపించాలి? (Who is God?)

ఆగస్ట్ 18, 2006

 దేవుడు అని ఎవరిని చూపించాలి? అని అభిరాం అడిగిన ప్రశ్నకు నాకిలా సమాధానం చెప్పాలనిపించింది. కానీ ఎందుకో “అభిరాం” లో comments section పని చేయట్లేదు. మీరన్నట్లు మనిషి సృష్టించిన దేవుళ్ళలో మనిషి బుద్దులు వుండటంలో వింతలేదు.

 కానీ పిల్లలకి దేవుడెవరంటే మదర్ థెరిసాను చూపండి, మహాత్మా గాంధీని చూపండి. కూలిపోతున్న భవనంలోకి ప్రజల ప్రాణాలను కాపాడ్డానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన 300 పైగా అగ్నిమాపకదళ సభ్యులను చూపండి. 25 మందికి పైగా పిల్లలను, పెద్దలను వరదనుంచి కాపాడి విద్యుధాగాథానికి బలైన ఆ అభాగ్యున్ని చూపండి. దేవుడి గదిలో వీళ్ళ ఫోటోలు పెట్టండి. ఆపదలో వున్న వాన్ని ఆదుకున్నవాడు, ఆకలితో వున్నవానికి ఇంత అన్నం పెట్టినవాడు, బాధలో వున్నవాన్ని ఓదార్చినవాడూ వీళ్ళందరూ దేవుళ్ళే. ఎదురుగా సాయం చేసిన వాన్ని దేవుడని తలవక, దేవుడే నిన్ను పంపించాడని ఆకాశం వంక చూడటం మూర్ఖత్వం.

పాలిచ్చే ఆవు, వెలుగిచ్చే సూర్యుడు ( ఆమాటకొస్తే సర్వ శక్తులూ సూర్యుడినుంచే వస్తున్నాయి), పంటనిచ్చే భూమి, నీరిచ్చే నది ఇవే అసలైన దేవతలు. సప్తాశ్వాల రధంపై వూరేగే సూర్యున్ని దేవుడిగా చూపక్కర లేదు. ఉదయ బింబాన్ని చూపి నమస్కరిస్తే చాలు. నమస్కరించడం, గౌరవించడం మన సబ్యత.

నమస్కరించినా, నమస్కరించకపోయినా సూర్యుడు వెలుగివ్వకా పోడు, పారే నది నీరివ్వకా పోదు, వీచే గాలి ప్రాణవాయువివ్వకా పోదు, రొమ్ము కొరికినా అమ్మ పాలివ్వకా పోదు. అదే అవ్యాజమైన ప్రేమ, unconditional love. మాతా అమృతానందమయి (hugging saint)ని మీరు ఎందుకు ప్రేమిస్తారు అని అడిగితే ఆమె ఇలాగే సమాధానం చెప్పింది. సూర్యుడు ఎందుకి వెలుగిస్తాడు? నది ఎందుకు నీరిస్తుంది? అది వాటి గుణం, తత్వం అలానే ప్రేమించటం నా గుణం, దీనికి కారణం అక్కరలేదు అని. ఒక సందర్భంలో ధర్మరాజు కూడా ఇలానే అంటాడు. హిమాలయాలంటే నాకిష్టం. ఎందుకంటే నాకు తెలియదు. ఇష్టపడటానికి కారణం అక్కరలేదు అని. ఇలా ఎవ్వరయితే ప్రతిగా ఏమీ ఆశించకుండా ఫలం ఇస్తూ వుంటారో వాళ్ళందరూ దేవతలే.

ఆధ్యాత్మికం

ఆగస్ట్ 16, 2006

పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?
చూపిస్తాడు. అసలు దేవుడికి పుణ్యం, పాపం తెలియవు. ఎండ, గాలి, వెన్నెల అందరినీ ఎలా సమానంగా చూస్తాయో దేవుడూ అట్లానే. వెన్నెల అందరికీ ఒకేలా కాచినా కవికి కనిపించినంత అందంగా పామరుడికి కనిపించకుంటే భేదం మనిషి మనసులో వుందే గానీ దేవుడిలో లేదు.

పాప పుణ్యాల కర్మ పలితాలు తర్వాతి జన్మలకు అనుసరిస్తాయా?
ఏ కర్మ పలితం ఆ జన్మకే పరిమితం. ఈ రోజు మనం చేసిన ఒక పుణ్యకార్యం (పూజలూ, వ్రతాలూ పుణ్యకార్యాలు కాదు) రేపు మనకు మేలు చేయవచ్చు. ఎలాగంటే, అప్పుడెప్పుడో ఒకనికి మా నాన్న సహాయపడ్డాడని ఈ రోజు అతను నాకు సహాయపడటం. ఆ రోజు మా నాన్న చేసిన పుణ్యం ఈ రోజు నాకిలా లబ్ది చేకూర్చిందన్నమాట. అలాగే పాపమూనూ, అప్పుడెప్పుడో నీవు కొట్టిన వాడు ఈ రోజు interview boardలో సబ్యుడుగా వుంటే నీవు పాపపలితం అనుభవించక తప్పదు. ఇలా మనం చేసిన పాపపుణ్యాల పలితాలు మనమో, మన పిల్లలో ఈ భూమిమీద అనుభవించాల్సిందే తప్ప తర్వాతి జన్మలూ లేవు..అనుసరించే తతంగమూ లేదు.

అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా?
మానవ జన్మే అన్ని జన్మలకూ వున్నతమయింది అయితే, మానవ జన్మే ముక్తి మార్గానికి అనుకూలమయిందయితే మని మానవ జన్మలు స్థిరంగానైనా వుండాలి లేదా తగ్గాలి గానీ ఇలా పెరుగుతూ ఎలా పోతాయి?సంబోగము, అండోత్పత్తి, ప్రసవము, జీవము ఇవన్నీ ఈ పేద్ద ప్రకృతి ప్రోగ్రాంలో ఒక బాగం. ఆ script ప్రకారం అన్నీ అలా జరుగుతూ వుంటాయి. శరీరం నశించడం తోనే శరీరానికున్న చలన స్వబావమూ, ఆలోచించే తత్వమూ అన్నీ నశిస్తాయి. పంచ భూతాలతో ఏర్పడిన శరీరము పంచ భూతాలతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన వన్నీ మళ్ళీ recycle చేయబడతాయి అయితే అలా recycle చేయబడి ఉత్పత్తి కాబడ్డ వస్తువుకి ఏవిదంగానూ తన ముందుతరపు గుణాలంటే ప్రశ్నే లేదు.

ఏది పాపం? ఏది పుణ్యం?
మహా భారత సూక్తిలా “నీకేది బాధ కలిగిస్తో అది ఇతరులకు చేయక పోవటం, నీకేదీ హాయినిస్తుందో అది ఇతరులకూ పంచటం” పుణ్యం.”నీకు బాధ కలిగించేది ఇతరులకు తలపెట్టడం పాపం.”

జన్మ యొక్క పారమార్థికత ఏమిటి?
జన్మించిన తర్వాత ఏమి చేసినా, ఏమీ చేయకున్నా ప్రకృతి మాత్రం తనపని తను చేస్తూనే వుంటుంది. శరీరం నశిస్తుంది, చలనత్వం పోతుంది.చచ్చే ముందు తర్వాతి తరం వారి జీవితాలను మరింత సుఖమయం చేయగలిగే ఏపని చేసినా జన్మ యొక్క పరమార్థం సిద్దించినట్లే.

మోక్షం అనగా ఏమిటి? అది ఎలా సిద్దిస్తుంది?
జన్మ, పునర్జన్మ చక్రం లోంచి బయట పడటం మోక్షమంటాయి వేదాలు. బయటపడి నాకు నేను మోక్షం పొందితే మానవ జన్మలు ఆగిపోవే! మానవులు పుడుతూనే వుంటారు, కష్టాలు పడుతూనే వుంటారు. వేదాల లెక్కన మనం మోక్షం పొందితే కష్టాలు పడే మానవులకి ఆసరా అందించకుండా తప్పుకున్నవాళ్ళమవుతాం.జీవితకాలంలో చేసిన మంచి పనులవల్ల ఆత్మతృప్తి కలిగి మరణించేటప్పుడు సంతృప్తిగా మరణిస్తే అది మోక్షం కలగడం. ఆ చిట్టచివరి తృప్తి తర్వాత ఏమీ లేదు.

ఇహ లోకంలో లేని స్వర్గనరకాలు పరలోకంలో ఉన్నాయా?
లేవు. అన్నీ ఇక్కడే వున్నాయి. దావూద్ లాంటి వాళ్ళు తప్పులు చేసి తప్పించుకొంటున్నామనుకుంటే పొరపాటే.

ఒకసారి శివుడుకీ, శనికీ ఏదో గొడవ వచ్చిందట. నీవు నన్నేమీ చేయలేవు అన్నాడు శివుడు. నేను తలుచుకుంటే నిన్నైన ముప్పతిప్పలు పెట్టగలనన్నాడు శని. అలా వాదించుకున్నాక ఏదీ నన్నేం చేస్తావో చూస్తానంటూ కైలాసం వదిలి ఒక భయంకరమైన అడివిలో ఓ చెట్టు తొర్రలో నివాసమున్నాడట కొన్నాళ్ళు, అక్కడైతే శని తనని కనిపెట్టలేడని.ఒక వారం తర్వాత బయటకొచ్చి శనిని పిల్చి నీవు నన్నేమీ చేయలేకపోయావు అన్నాడు. అందుకు శని “నా ప్రభావం లేనిదే నీవు చల్లని కైలాసం వదిలి చెట్టు తొర్రలో నక్కావా?” అన్నాడట.అలా అజ్ఞాతంలో, భయం నీడలో బతకడం కూడా ఒక నరకమే. ఆతని పాప పలితాలు అతని పిల్లలనీ చుట్టుకుంటాయి తర్వాత.

వివిధ మతాలు మనిషిలో పాపభీతి కలిగించుటలో ప్రవక్తల, సాదు జనుల, దైవావతారుల అంతర్లీన భావ మేమిటి?
శిక్ష వుంది అంటేనే తప్పు చేయడం మానే పిల్లల్లాంటివారు అధికమంది ప్రజలు గనుక. తప్పుకు కఠిన శిక్షలు అందుకే. పాపమూ లేదు, పునర్జన్మా లేదు, అంటి వచ్చేదీ లేదు అంటే ఏ తప్పుచేసినా కోర్టూ లేదు, తీర్పూ లేదుజైలూ లేదు అనడం లాంటిది. ప్రతి తప్పునూ చూడటానికి ప్రతి ఒక్కడి వెంటా ఒక పోలీసును ఎళ్ళవేళలా వుంచలేము. అదే భయమనే పోలీసును అతడి మనసులోనే పెడితే అదే కాపాడుతుంది తప్పును చేయనివ్వకుండా.

డేవుడు నిర్వికారుడూ, నిర్గుణాకారుడా?
దేవుడు నిర్వికారుడే. కానీ గుణం లేకపోవటమనే గుణమున్నవాడు. మనిషికి అవసరానికి అబద్దమాట్లాడటమూ తెలుసు. కానీ దేవుడికి ఎళ్ళవేళలా సత్యం మాట్లాడమే వచ్చు. గుణముంది, అదే సత్యమే మాట్లాడాలన్నది కానీ విచక్షణ లేదు. రోజూ వర్షం కురిసే చోట “ఈరోజు వర్షం కురుస్తుంది” అన్నది వార్త ఎలా కాదో, విచక్షణ లేక ఎన్ని గుణాలున్నా గుణహీనుడే.

అతని పేరు మీద భజనలు, భక్తి, తంత్రాలు, మంత్రాలు అవసరమా?
అస్సలవసరం లేదు.
దేవుడు భజనలకీ, పూజలకీ, వ్రతాలకీ లొంగడు. “7 habits of highly effective people లో ఈ కథ వుంది.

సముద్రమంతా పొగమంచు కమ్ముకొని వుంది. ఎక్కువ దూరం కనిపించటం లేదు. ఇంతలో నౌక కెప్టన్‌కి వార్త వచ్చింది. దూరంగా ఏదో లైటు వెలుగుతోంది, ఏదో నౌకలా వుంది అని.
కెప్టెన్: అది కదులుతూ వుందా స్థిరంగా వుందా?
నావికుడు: కదలటం లేదు నిశ్చలంగా వుంది.
కెప్టెన్: 20 డిగ్రీలు పక్కగా కదలమని సమాచారమివ్వు. లేకుంటే డీకొట్టుకొనే ప్రమాదముంది.
నావికుడు: డికొట్టుకొనే ప్రమాదముంది. 20 డిగ్రీలు పక్కకు జరగండి.
అటువైపునుండి: మీరే 20 డిగ్రీలు పక్కకు మరలండి.
కెప్టెన్: నేను నౌక కెప్టెన్ చెప్తున్నాను, 20 డిగ్రీలు పక్కకు జరగండి.
అటువైపునుండి: నేనూ అధికారినే, మీరే పక్కకు జరగండి.
కెప్టెన్: మాది సైనిక ఓడ. పక్కకు జరగక పోతే పర్యవసానం ఎదుర్కోవాల్సివుంటుంది, పక్కకు జరగండి.
అటువైపునుండి: ఇది దీప స్థంబము (light house).

ఇక కెప్టెన్ అయినా నౌకలో వుండేది దేశాద్యక్షుడైనా పక్కకు జరగాల్సిందే. దీప స్థంబము పక్కకు జరగదు. దేవుడూ అంతే పూజలూ, వ్రతాలూ, యజ్ఞాలూ, యాగాలూ ఏమీ చేయలేవు.
భజన అన్య విషయాల మీద మనసు పోకుండా వుంచుతుంది. అచంచలమైన భక్తి ఒక భ్రాంతిలో ముంచుతుంది. తంత్రాలూ, మంత్రాలూ ఆ బ్రాంతిని చేరుకోవడానికి సాధనాలవుతాయి. ఇవన్నీ కూడా ఎవరికి వారు తమదైన బ్రాంతిని నిర్మించుకొని అందులో జీవితాన్ని నిష్పలంగా ముగించడానికి తప్ప పరులకు ఉపయోగపడేదేమీలేదు. పరులకు వుపయోగపడని ఏ పూజా, కర్మా కూడా నిష్పలం. పిల్లవాడు బొమ్మలతో ఆటాడుకొన్నట్లు.

ఏది అసలైన దైవ సేవ?
నరసేవే నారాయణ సేవ. జీవి సేవే పరమాత్మ సేవ.”live let live”

అసలు పాపభీతితో దైవసేవ చేయటం అవసరమా?
రామనాధ రెడ్డి అన్నట్లు, గూండాను భయంతో మొక్కినట్లే పాపభీతితో దైవసేవ చేయటం. ఎవరికి వారు జవాబుదారీ. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలుసు. చేసేది చేసి ఆనక తప్పు చేశాను క్షమించమంటే క్షమించడానికి దేవుడు మనిషి కాదు.

నమ్మకం

ఆగస్ట్ 14, 2006

 “యజ్ఞాలు, యాగాలు మరియు
పూజలు ఎందుకు వీటిని
నమ్మవచ్చా?” ప్రశ్నకు నా సమాధానం.

దయ్యం పట్టిందని నమ్మేవాడికి భూతవైద్యుడే సరైన వైద్యం. మా తాత ఒక కథ చెప్పేవాడు. ఒకడు తెల్లవారుజామున దొడ్డికి ఆరుబయలు వెళ్ళినప్పుడు ఓ తొండ తనవైపే పరుగెట్టుకొచ్చి, తన కాళ్ళ మధ్య మాయమైపోయిందట. అప్పట్నుంచి వాడీకి కడుపులో ఏదో దేవినట్లు, తొండ తిరుగుతున్నట్లు అనిపించి మంచం పట్టేశాడట. ఎన్ని వైద్యాలు, మందులూ వాడినా వాని రుగ్మతలను నయం చేయలేక పోయాయి.
చివరికి ఒక తెలివైన మాంత్రికుడు తను నయం చేస్తానని ఒక బయలు ప్రదేశానికి తీసుకువెళ్ళి, ఏవో నోటికి వచ్చిన మంత్రాలు పఠించి దొడ్డికి కూర్చోమన్నాడట. వాడలా ముక్కుతూనే ముందే తెచ్చుకున్న సంచీలోంచి వాడికి తొండను బయటికి తోలి, అదిగో నీ కడుపులో తొండ వెళ్ళిపోతోంది చూడు అన్నాడట. అంతే వీడి కడుపు నొప్పి, తిరుగుడు దెబ్బతో పోయి మళ్ళీ మామూలు మనిషయ్యాడట.

మరి మంత్రం పని చేసిందా లేదా?

పని చేసేది మంత్రం, పూజలూ కాదు; నమ్మకం. రాతిని దేవుడని నమ్మినా అది ఎన్నో జీవితాలను మార్చట్లా? నరకం వుంటుందని నమ్మే వాళ్ళకు అవసాన దశలో యముడు కనపడట్లా? కృష్నుడే దేవుడని, అల్లా నే దేవుడని, క్రీస్తే దేవుని కుమారుడని ఎవరెట్లా నమ్మినా, నమ్మకమే సత్యం, నమ్మబడిందసత్యం. నీవెంత గాఢంగా నమ్మితే పలితం అంత దృఢంగా వుంటుంది.

( ఇప్పుడు దశమ గ్రహం కూడా వుందని అంటున్నారు పరిశోధకులు. మన పూర్వీకులు పండితులే, కానీ మన తాతలు తాగిన నేతుల వాసన మన మూతులకు అంటదు కదా!)

దేవుడు రాశాడా?

ఆగస్ట్ 11, 2006

“మన జీవితం మన చేతులొ వుంది
అనడం ఒప్పా ?
ముందుగానె  దెవుడు
వ్రాస్తాడు అనడం ఒప్పా ?”
ఈ ప్రశ్నకు నా స్పందన.

ప్రతి క్రియకు ఓ నిర్దిష్ట పలితాన్ని దేవుడు రాశాడు లేదా ప్రకృతి రాసింది. పలాయన వేగం కంటే తక్కువ వేగంతో పైకి విసిరిన ప్రతిదీ కిందికే పడుతుంది. అది విసిరింది సత్య సాయిబాబా అయినా, నేనయినా. ఆటంబాంబో, హైడ్రోజన్ బాంబో వేస్తే అందరూ చస్తారు, పుణ్యం చేసిన వాడైనా, పాపం చేసిన వాడైనా. అది ప్రకృతి నియమం. రాయబడింది ఈ నియమాలే, మన జీవితాలు కాదు. విద్యుత్తీగను పట్టుకోవడమా, మానడమా అన్నది మన చేతుల్లోనే వున్నది అయితే పట్టుకున్నాక మరణించడమన్నది ప్రకృతి (అనగా దేవుడు) చేతుల్లో వుంది. దేవుడు చేతుల్లో ఏముందో అది సత్యము, మార్చ లేనిది, మార్పు లేనిది, పక్షపాతము లేనిది. మన ఋషుల మాటల్లో చెప్పాలంటే ఈ సత్యమే దేవుడు. గుణరహితమనే గుణమున్నవాడు దేవుడు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, తంత్రాలు, మంత్రాలు ఈ ప్రకృతి నియమాల్ని మార్చవు.
కాబట్టి దేవుడు రాసిందేదో రాసేశాడు, అది నీకు ఒకలా, నాకు ఒకలా రాయడు. ఎండ నిన్నెలా కాలుస్తుందో నన్నూ అలానే. అన్నం నీకెలా ఆకలిని తీరుస్తుందో నాకూ అలానే. వెన్నెల నీకెలా కాస్తుందో నాకూ అలానే. ఇందులో పక్షపాతం లేదు. ఆస్తికుడు, నాస్తికుడు అన్న భేదం లేదు.
మన జీవితం మనం రాసుకొనేదే. నీ చేతిలో రాయితో నీ తలకేసికొట్టుకుంటావో, నా తలకేసి కొడతావో అది నీ చేతిలో వుంది, అది నీవు రాసింది; దేవుడు రాసింది కాదు. ఎవడి తలకేసి కొడితే వాడి తల పగలాలి అని మాత్రమే దేవుడు రాశాడు.

పరమాత్మ

జూలై 25, 2006

http://rohiniprasadkscience.blogspot.com/  ఈ బ్లాగు చూశాక ఇక నా స్పందనను దాచుకోలేక పోయాను. 

నా మట్టుకు నాక్కూడా ఖచ్చితంగా దేవుడంటే ఇలాంటి భావాలే వున్నాయి. సృష్టిలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవన్నీ అలానే జరగాలనేది భౌతిక సూత్రమనేది నా అభిప్రాయము. భూమికి ఆకర్షనశక్తి ఎందుకు వుండాలి, ఈ గ్రహాలన్నీ తమ తమ నిర్దేషిత కక్ష్యల్లోనే ఎందుకు ప్రయానించాలి లాంటి ప్రశ్నలకు నా సమాధానం, “సత్యమే ఎందుకు పలకాలి” అన్నదానికి జవాబు ఎలా లేదో, అలానే వీటి ప్రవర్తనకు జవాబు లేదు. ఒకవేళ వున్నా అది మళ్ళీ జవాబులేని ప్రాధమిక సూత్రాలను బట్టే వుంటుంది. ఈ సృష్టి అంతా కొన్ని వాదించలేని, తర్కించలేని ప్రాధమిక భౌతిక సూత్రాలపై ఆధారపడి వుంది. కత్తితో పొడిస్తే అది పుణ్యాత్మున్నైనా, పాపాత్మున్నైనా ఒకేలా భాధిస్తుంది. కత్తికి, బాధకు సంబందం లేదు. అలాగే కత్తి గుచ్చుకుంటే భాధ కలగాలి అన్నది ప్రాధమిక సూత్రం. ఇందుకు కటిక బీదవాడికైనా, సత్యసాయి బాబా కైనా మినహాయింపు లేదు. అలాగే పదార్థాము చైతన్యమయము కావడము, చైతన్యరహితం కావడం అన్నీ కూడా ఇంకా కనిపెట్టని ప్రాధమిక సూత్రాల మూలంగా జరుగుతున్నవే. అయితే ఇక్కడే ఎక్కడో భౌతిక వాదము, ఆద్యాత్మిక వాదము కలుస్తాయనుకుంటాను. జంతువుల తలలతో దేవుళ్ళను పూజించడం ఇవన్నీ అత్యున్నత స్తాయిలోని అద్యాత్మికవాదాన్ని తెలుసుకోలేని అల్పబుద్దులను సంతోషపెట్టాడానికి చేసిన nopnsense అనిపిస్తుంది. అయితే అన్నిటిలోనూ వుండి అన్నీ తనలో వుండే సర్వాంతర్యామి దేవుడు అంటే నేను పెద్ద వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇప్పటివరకూ అనుకున్న తర్కించలేని, వివరించలేని ఏ ప్రాధమిక భౌతికసూత్రాలపై ఆధారపడి ఈ సృష్టి, విశ్వం, చైతన్యమవుతూ వుందో,  పదార్థం చైతన్యసహితమూ, చైతన్యరహితమూ అవుతూందో, ఆ భౌతికసూత్రాలనే పరమాత్మ అనుకోవచ్చేమో. అయితే అంతమాత్రాన ఆ పరమాత్మకి బుద్దిని జోడించి పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, బలులివ్వడం ఎంత అవివేకమంటే పైకి విసిరిన కింద పడకూడదని, గాలిలో పెట్టిన దీపం ఆరిపోకూడదని ప్రార్థించడం లాంటిది. ప్రతి క్రియకూ పలితం భౌతికసూత్రాలపై ఆదారపడి వుందే కానీ అది పూజల వల్ల వ్రతాల వల్ల మారదు.
అయితే ఈ సత్యాన్ని నగ్నంగా చూపడంవల్ల ఈ స్థాయిలో ఆలోచించని వారు, భగవంతుడూ, స్వర్గం,  నరకం లేవు అంటే పాపభీతి లేకపోవడం వల్ల సమాజానికి అనర్థం చేస్తారేమొ. ఇలా ఆలోచించడం కూడా తప్పేనేమొ, ఈ దేవుళ్ళమీద విశ్వాసం వుంచడం వాల్ల మాత్రం ఇప్పుడేం జరుగుతున్నది? మతాలపేరుతో చంపుకోవడాలేగా!

— ప్రసాద్
https://charasala.wordpress.com

జయమాల అయ్యప్ప స్వామిని తాకిందా?

జూలై 3, 2006

అయితే ఏంటట? ఎందుకీ గోల? అసలీ రాతికాలపు ఆచారాలనుండీ మనం బయటికి వచ్చేది ఎన్ని యుగాలకూ జరగదా! అసలు ఆడవాళ్ళని ఎందుకు నిషేదించాలట? స్వామి వారికి ఆ మాత్రము నిగ్రహము లేదా? లేక ఆయన్ను దర్షించే ఆడవాళ్ళు అదుపు తప్పి ఆయన్ను లోబర్చుకుంటారని భయమా? ఆదీ 10 నుంచి 50 ఏళ్ళ మద్య  స్త్రీలు అంటేనే భయమట!!
పవిత్రం, అపవిత్రం.. మ్మ్ .. గూండాలు, ఖూనీకోరులు మెడలో మాలలేసుకొని పాపాలు పోయాయ్, పవిత్రమైపోయాం అనుకొని యాత్ర చేసేస్తున్నారు.. ఏ దుర్బుద్దీ లేకుండా, కేవలం దైవాన్ని చూద్దామని పవిత్ర భావనతోనే వచ్చినా ఆడవాళ్ళన్న కారణంగా తిరస్కారమా??
ఆడవాళ్ళైనందున వారిది పాపమా! కోరికలు అదుపులో పెట్టుకోలేని నీచులది పాపమా!! ఎవరు నిషిద్దులు??
నామట్టుకు నేనైతే ఆ గుడి చాయలకే నా జీవితం లో వెళ్ళను. ఏదో కవి అన్నట్లు “ఈ లోకానికే ప్రవేశద్వారం అమ్మ” ఆ అమ్మకే లేని ప్రవేశం మనకు అవసరమా?
— ప్రసాద్

అన్నయ్యకో లేఖ – a letter to my brother

జూన్ 29, 2006

ప్రియమైన అన్నయ్యకు నమస్కారములు.

      పిల్లలకు నా శుభాకాంక్షలు. వదిన గారికి నమస్సులు.

      నాకీ మద్య ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. బహుశా తగినంత పని ఆఫీసులో లేకపోవడం వల్ల అనుకుంటాను. idle mind is devils workshop అని ఎవరో అన్నారట గదా! దెయ్యాలో, దేవతలో గాని మొత్తానికి నా మెదడు పరిపరి విధాలా అలోచిస్తున్నది. ముఖ్యంగా ఈ జీవితము, దీని గమ్యము గురించి పెద్ద చింతే పట్టుకున్నది.

ఎదీ రుచించడము లేదు.ఏది తిందామన్నా ఆకలికి ఆకొన్నవారూ, ఆకలితో చస్తున్నవారూ నా చేతిలోది లాక్కుంటున్నట్లే ఉంది. ఆకలిగొన్న వాడికి పెట్టకుండా నా కడుపుకే నిర్దాక్షన్యంగా, నిర్దయగా తింటున్నట్లే ఉంటుంది. ఆ ఆకలికళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఏమి తిందామన్నా! నా పిల్లల బోసి నవ్వుల్ని చూసినప్పుడల్లా, తల్లీదండ్రీ లేని అనాధ పిల్లలు, బాలకార్మికులూ, వెట్టిచాకిరీ చేస్తున్న వాళ్ళు నాకూ కావాలి ఆ బోసినవ్వులని అడిగినట్లే ఉంటోంది. సరైన వైద్యము లేక చని పోతున్న పసిపిల్లలు ‘మాకేదీ ఆ బోసినవ్వు” అని ప్రశ్నిస్తున్నట్లే ఉంది. మెత్తటి పరుపు మీద ఆఛ్ వేసుకొని పడుకున్నా నిద్రే రావటం లేదు. చలికి, ఎండలకీ చని పోతున్న వాళ్ళ చావుకేకలే విని పిస్తున్నాయి. ఇల్లులేని వాళ్ళు,రోడ్డు పక్క నిద్రపోయి వాహనాల కింద నలిగి చచ్చేవారి రోదనలే వినిపిస్తున్నాయి ఇక నిద్ర ఎలా వస్తుంది. కారులో రోజూ ప్రయానిస్తున్నాననే మాటేగానీ, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి దీనాలాపనలు, చావుకేకలు విపిస్తున్నాయి.

గాలిబ్ గీతాలూ, ఠాగూర్ గీతాంజలి ఇప్పుడేమాత్రమూ రుచించటము లేదు.

ఎందుకు పుట్టాము? ఎందుకు జీవిస్తున్నాము? మనం సంపాదించి, మన పొట్ట నింపుకొని, మన పిల్లల బాగుచూసుకొని, వీలైతే మన మనవల కోసం, మునిమనవల కోసం దాచి పెట్టడమేనా జీవితమంటే!!!! ఇన్ని రోదనల మద్యా, ఆకలి చావుల మద్యా, అభాగ్యుల మద్యా!!! చూస్తుంటే ఈ లోకంలో నాకు తప్ప అందరికీ, అన్నిటికీ ఎదో ఒక పరమార్థము ఉన్నట్లే తోస్తోంది. తనకోసమే తాను ఎదీ కనపట్టం లేదు ఒక స్వార్థపరుడైన మానవుడు తప్ప. చచ్చిన తర్వాత శవాలు కూడా ఉపయోగపడుతున్నాయి, కళ్ళు ఇంక ఇతర శరీర భాగాలూ! క్రిములూ, కీటకాలూ, మన్నూ, ఆకాశం, అగ్ని, నీరు, సముద్రాలూ, కొండలూ అన్నీ, అన్నీ ఎదో విధంగా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి…ఒక స్వార్థపరుడైన మనిషి తప్ప. ఉదయాన లేచిన దగ్గరినుండీ పరుగే పరుగు కాస్తంత సమయం దొరుకుట లేదు, పరచింతనకీ, పరోపకారానికి! పరసేవ చేయలేని జీవతము జీవించడమెందుకూ? అదేకదా మనం చేయాల్సిన ఫుల్ల్ తిమె జొబ్? కానీ అంతా తారుమారు అయినట్లుంది, నా పొట్ట కోసం తొంబైతొమ్మిది శాతం, ఒక్క శాతం లేకుంటే అదీ లేదు .. ఇతరుల కోసం!

ఇన్ని ఆలోచనల తర్వాతే మన ఊరిలో తన వారంటూ ఎవరూ లేని ముసలి వారికి, తమ పని తాము చేసుకోలేని బలహీనులకీ కనీసం అన్నం పెడదామనుకొన్నాం కద? పెడితే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి లేకుంటే ఎవరికీ వద్దు అంటే ఎలా? మనకున్న స్తోమతుకి తిండిలేని అభాగ్యులకు, బలహీనులకూ మాత్రమే కదా ప్రస్తుతానికి పెట్టగలం. మిగతా వారు పెట్టకపోతే నిందిస్తారంటారా? నిందలూ, అపనిందలూ, కీర్తి, అపకీర్తి వీటికి మనం చింతించాలా? ఎవరు ఎన్ని అంటే మనకెందుకు? మన అంతరాత్మ చెప్పిందే చేద్దాం. ఇక ఊరిలో ఎవరికో ఇచ్చి వండమంటే కాజేస్తారంటారా? కాజేయనీ కనీసం కొంతలో కొంతైన అనుకున్న పని జరక్క పోతుందా!

నన్నడిగితే మనమే ఆ పని ఎందుకు చేయకూడదు? నాన్న రోజూ ఉదయం, సాయంత్రం గర్భగుడిలో దేవున్ని పూజించడానికి వెళ్ళేబదులు, ఆకలిగొన్న మనిషి గుడిలోని ఆత్మారామున్ని కొలవడం పుణ్యం కాదా?

నాకైతే ఏదో రోజు ఈ తీవ్రమైన సంఘర్షణ తట్టుకోలేక అన్ని ఇక్కడే వదిలేసి ఇండియా వచ్చి బీదజనుల సేవ చేసుకోవాలని పిస్తోంది. అందరూ నన్ను పిచ్చివాడంటారేమొ! అననివ్వు, ఇన్ని బాధల మద్యా, ఆకలి కేకల మద్యా నవ్వుతూ బతకడం కంటే వారి మద్యనే ఆ బాధల్ని అనుభవిస్తూ చావడం మంచిదేమొ! ఇన్ని ఘోరాల మద్య, నేరాల మద్య, ఆకలి దప్పుల మద్యా చలం ప్రేమ లేఖలో, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమో చదువుతూ ఆనందింపలేకున్నాను. ఎప్పటికైనా నా గమ్యము అదే అనిపిస్తుంది. దీనజన సేవే అసలైన దైవ సేవ అనిపిస్తొంది. ఇప్పుడిప్పుడే నాకు దారి స్పష్టమవుతోంది.

మీరేమంటారో సెలవియ్యండి. అమ్మానాన్నలతో అనకండి వాళ్ళకిదంతా అర్థం కాదు.

ఉంటాను మరి.

ఇట్లు

మీ ప్రియమైన తమ్ముడు

ప్రసాద్

పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?

జూన్ 7, 2006

నా అభిప్రాయం ప్రకారం దేవుడు అందరిపట్లా ఒకేలా ప్రవర్తిస్తాడు.

అన్నమయ్య కీర్తన ఈ సందర్బంగా గుర్తుకు వస్తోంది. మహారాజుకైనా, కటిక బీదవాడికైనా నిద్ర ఒకటే. ఐశ్వర్యవంతునకైనా, అడుక్కుతినువానికైనా ఆకలి ఒక్కటె. ఇంకా ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.

సూర్యుడి ఎండ దుర్మార్గుడి మీద మరియు సన్మార్గుడి మీద ఒకేలా ప్రసరిస్తుంది. అంతెందుకు పంచభూతాలన్ని సర్వ జీవులకు ఒకేల అనందాన్ని ఇస్తాయి. కాకపోతే మానవుడు తన విచ్చలివిడితనంతో పంచభూతాల్ని చెరబడుతున్నాడు.

ఒక కత్తి దుర్మార్గున్ని ఎలా బాదిస్తుందో సన్మార్గున్నీ అలాగే బాదిస్తుంది.

పురాణాల్లో జరిగినట్లు పుణ్యాత్ములకు పరమాత్మ కనిపించి కష్టాల్లోంచి బయట పడవేయటం జరగదు. ఎంతటి పతివ్రత ఐనా, ఎన్ని వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినదైనా అగ్నిలో దూకితే మాత్రం తప్పక చస్తుంది. అందులో ఏమాత్రం మినహాయింపు లేదు.

దీన్ని బట్టి నాకేం అర్థం అయిందంటే అత్యధికులు అనుకుంటున్నట్లు దేవుడు అనే ఒక అతీద్రియ శక్తి లేదు. ఉన్నదల్లా ప్రకృతి ధర్మమే.

అంటే ప్రకృతికి లేదా ఈ సృష్టికి ప్రతి క్రియకు దానికి సంబందించిన ఫలితాన్ని ఇవ్వడమే తెలుసు. అందులో ధర్మ విచక్షణ చేయడం తెలియదు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోగల శక్తి ఈ ప్రకృతికి లేదు. అందుకు నాకు తోచే బలమైన ఇంకొక ఉదాహరణ .. బలాత్కారానికి గురైన స్తీ కూడా గర్భవతి కావడం. ఈ ప్రకృతికి ధర్మం తెలిసిఉంటే, అలాంటి స్తీకి గర్బం రాకూడదు.

ఐతే అదే ప్రకృతి ధర్మాలవల్ల సృష్టింపబడిన మనిషికి మాత్రం ఈ ధర్మాధర్మ విచక్షణ తెలుసు. కావున ధర్మాన్ని కాపడవలసింది మనిషే కాని ఇంకెవరూ కాదు.

గీతలో కృష్నుడు కూడ ఇదే చెప్పాడని నాకనిపిస్తుంది. ధర్మం పాండవుల పక్షాన ఉన్నపుడు కృష్నుడే వారి తరపున యుద్దం చేసి అధర్మపక్షీయులను సంహరించి ఉండవచ్చుకద? అలా చేయడు. అర్జునున్ని యుద్దం చేయమని ప్రేరేపిస్తాడు. అంటే దేవుడు చేయడు, మనిషే చేయాలి.

కాకపోతే ప్రతిక్రియకూ పలితం నిర్దారించబడినట్లే మనిషీ చేసే ప్రతి కార్యానికి పలితం ఉండిఉంటుంది.

ఈ సృష్టి, ఈ విశ్వం అంతా కూడ మార్చవీలులేని ప్రకృతి ధర్మాలమీద ఆధారపడి నడుస్తున్నది. ఈ మార్చవీలులేని, ఎన్నటికీ మార్పు చెందని ధర్మాలనే "సత్యము" అనవచ్చు. ఆస్తికులు ఈ సత్యాన్నే "భగవంతుడు", "పరమాత్మ" అంటూ ఉండవచ్చు. అయితే నాకు వచ్చిన చిక్కల్లా ఈ భగంతుడు గుణసహితుడు అనడంలోనే. నేను నమ్మే ఈసత్యం నిర్గుణం. ధర్మాధర్మం, న్యాయాన్యాము తెలియదు. పున్యాత్ముడికోసం ఈ సత్యము మారదు. దుర్మార్గుడి కోసమూ ఈ సత్యము మారదు.

దేవుదైనా సరే ప్రకృతివిరుద్దంగా చేతిలో బంగారు సృష్టించలేడు. రాత్రిపూట సూర్యున్ని చూపించలేడు.

మనిషికున్న బుద్దిబలంచేత ఈ సత్యాన్ని అనగా మార్చ వీలులేని ధర్మాల్ని ఎంతగా తెలుసుకుంతే అంతగా అభివృద్ది సాధిస్తాడు. (న్యూటన్ సూత్రాలు, ఐన్‌స్టీన్ సిద్దాంతాలు ఈ సత్యాలే)